విధి విధానాలు ఖరారు చేస్తున్నాం..
ఈ సంవత్సరం అక్రిడిటేషన్ల ప్రక్రియ
కొత్త సంవత్సరం ఇంటి జాగాలపై తీపి కబురు
టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఫెడరేషన్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా ఖదీర్, శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం
జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ మరో పదిరోజుల్లో ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్, ఐఅండ్ పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం చివరికి అక్రిడిటేషన్ల ప్రక్రియ, వచ్చే ఏడాది జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపుపై తీపి కబురు చెబుతామని స్పష్టం చేశారు. ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్లో శనివారం నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా మహాసభను ఉద్దేశించి ఆయన ఫోన్లో మాట్లాడారు. మహాసభకు హాజరయ్యేందుకు బయలుదేరిన మంత్రికి సీఎం కార్యాలయం నుంచి ఆకస్మిక పిలుపు రావడంతో హైదరాబాద్ వెళ్లారు. అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నందుకు మన్నించాలని జర్నలిస్టులను కోరిన మంత్రి.. తన సందేశాన్ని ఫోన్ ద్వారా వినిపించారు.
అక్రిడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని తెలిపారు. అక్రిడిటేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుందని, పది రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. అందువల్ల ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొత్త సంవత్సరం ఆరంభంలో ఇండ్ల స్థలాల విషయమై తీపి కబురు అందిస్తామని చెప్పారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ ఘనంగా నిర్వహించుకోవడం పట్ల సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకత్వానికి మంత్రి అభినందనలు తెలిపారు.
జర్నలిస్టులకు అనుకూలంగా ఉంటాం : సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి
కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు అనుకూలంగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. తన నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలతోపాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తానని తెలిపారు. ముందుగా పెవిలియన్ గ్రౌండ్ వద్ద చేపట్టిన ర్యాలీని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య ప్రారంభించారు.
ఫెడరేషన్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా ఖదీర్, శ్రీనివాస రెడ్డి
మహాసభలో భాగంగా టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా సయ్యద్ ఖదీర్, కార్యదర్శిగా కొత్తపల్లి శ్రీనివాస రెడ్డి, కోశాధికారిగా తేనె వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్గా సాగర్ దువ్వ, సహాయ కార్యదర్శులుగా జక్కంపుడి కృష్ణ, కూరాకుల గోపి, నాగుల్ మీరా ఎన్నికయ్యారు.



