నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
మావోయిస్టుల పేరుతో లేఖ రాసిన ఇద్దరు నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షాపూర్నగర్ హెచ్ఎంటీ సొసైటీలో నివాసముంటున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం సోదరుడి కొడుకు కూన రాఘవేంద్రగౌడ్ ఇంటి ఆవరణలోని తులసి కోటను ఈ నెల 21న గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అనంతరం అక్కడ ఒక ఎర్రని టవల్లో లేఖను ఉంచి వెళ్లిపోయారు. ఆ లేఖలో తాము నక్సలైట్లమని, తమకు శుక్రవారం వరకు రూ.50 లక్షలు ఇవ్వనిపక్షంలో కూన రాఘవేందర్ గౌడ్ను చంపేస్తామని బెదిరించారు. అలాగే రెండు ఇండ్లను బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించారు. దాంతో రాఘవేందర్ గౌడ్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారిని రాఘవేందర్ గౌడ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజు, అతడి స్నేహితుడిగా గుర్తించారు. నిందితుల వద్ద నాటు బాంబులు, 3 సెల్ఫోన్లు, 2 బెదిరింపు లేఖలను స్వాధీనం చేసుకున్నారు. నాటుబాంబులను విజయనగరంలో కొనుగోలు చేసినట్టు తెలిసింది.
మావోయిస్టుల పేరుతోలేఖ రాసిన నిందితుల అరెస్ట్
- Advertisement -
- Advertisement -