యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 1992 లో 178 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఎర్త్ సమ్మిట్ నిర్వహించారని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి పేర్కొన్నారు.
గురువారం తెలంగాణ యూనివర్సిటీ లో అర్థశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఏ పున్నయ్య ఆధ్వర్యంలో ఎంపవరింగ్ ఇండియా 2047: స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ” అనే అంశం పై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆ సమ్మిట్ అభిప్రాయపడిందని,దీనిలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 2000 సంవత్సరంలో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ద్వారా పేదరికాన్ని 2015 నాటికి తగ్గించాలని నిర్దేశించుకున్నా రన్నారు.
అనంతరం 2002లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు యందు ప్రపంచ దేశాల స్నేహపూర్వక సంబంధాలతో సుస్థిర అభివృద్ధి సాధించాలని నిర్ధారించుకొని, 2012- 2013లో జరిగిన సదస్సుల యందు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నిర్ధారణ జరిగి జనవరి 2015లో 2030 నాటికి సాధించాల్సిన17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించడమైందన్నారు.
ఇదే దిశలో భారతదేశంలో కూడా 2047 నాటికి సాధికారత గల భారతదేశంగా ఎదగడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్ధారించుకొని వాటిని సాధించడానికి అనేక రకాల వ్యూహాలను ఏర్పాటు చేసుకోవడం అయిందన్నారు. ఈ రెండు రోజుల జాతీయ సదస్సును విజయవంతంగా పూర్తి చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ కన్వీనర్ మరియు ప్రొఫెసర్లను విద్యార్థులను అభినందించారు.
ఈ ముగింపు సమావేశానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ప్రొఫెసర్ రాణి రత్నప్రభ, చిట్టేడు కృష్ణారెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ప్రసంగిస్తూ ఈ రెండు రోజుల జాతీయ సెమినార్ పరిశోధక మరియు పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ సెమినార్ లో చర్చించిన అంశాలు వికసిత భారత్ కు మార్గ నిర్దేశం అవుతాయన్నారు.
రెండవ రోజు జరిగిన టెక్నికల్ సెషన్లకు ప్రొఫెసర్ రాణి రత్నప్రభ, ప్రొఫెసర్ చిట్టెడు కృష్ణారెడ్డి, ప్రొఫెసర్ కె కృష్ణారెడ్డిలు అధ్యక్షత వహించగా డాక్టర్ సరస్వతి, డాక్టర్ శ్రద్ధానందం, డాక్టర్ సౌందర్య, డాక్టర్ సిద్ధలక్ష్మి, డాక్టర్ సుజాత లు సంధానకర్తలుగా వ్యవహరించినారు.సెమినార్ కన్వీనర్ అర్థశాస్త్ర విభాగాధిపతి, డాక్టర్ ఏ పున్నయ్య మాట్లాడుతూ అమెరికా, సౌత్ కొరియా, బ్రిటన్ దేశాల నుండి ప్రామాణికమైన పత్రాలు అందడం సంతోషంగా ఉందన్నారు.
దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలనుండి 140 పత్రాలలో వివిధ విశ్వవిద్యాలయాల నుండి , డిగ్రీ కళాశాల నుండి ఆన్లైన్ ద్వారా మరియు ప్రత్యక్షంగా 64 పత్రాలు సమర్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి,డాక్టర్ నాగరాజు పాత, డాక్టర్ స్వప్న తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వివిధ యూనివర్సిటీల నుండి వచ్చిన ప్రొఫెసర్లు పేపర్ ప్రెజెంటర్స్ విద్యార్థులు పరిశోధకులు పాల్గొన్నారు.