Monday, June 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనకిలీ బీటెక్‌ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలి

నకిలీ బీటెక్‌ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఇంజినీరింగ్‌ విద్యనందించే పేరుతో కొంతమంది నకిలీ బీటెక్‌ యూనివర్సిటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఏడాదికి రూ. లక్షలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి నాగరాజు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్‌ రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు లెనిన్‌ గువేరా, ఉపాధ్యక్షులు నాగేందర్‌, శ్రీమాన్‌, స్టాలిన్‌తో కలిసి నాగరాజు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. నకిలీ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో నెక్ట్స్‌ వేవ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎటి) నానక్‌ రామ్‌గూడ, లిఫ్‌ స్టార్ట్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ పేరుతో ఫైనాన్స్‌ డిస్ట్రిక్‌లలో ప్రయివేటు అపార్ట్‌మెంట్లు తీసుకుని వీటిని నడుపుతున్నారని ఆరోపించారు. ఐఐటీలో లేదా ఎన్‌ఐటీల లో అడ్మిషన్లు రాకపోయినా ఐఐటీ లాగే ఎన్‌ఐటీ స్థాయిలో సీఎస్‌ఈ.( ఆర్టిఫీషియల్‌, మెషిన్‌ లెర్నింగ్‌), సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల పేరుతో అడ్మిషన్లు తీసుకుని తరగతులు నడుపుతున్నారని చెప్పారు.
యూజీసీ, ఏఐసీ అనుమతులు లేకుండా క్యాంపస్‌ ప్రారంభించటమేంటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను చేర్పించుకుని భారీగా ఫీజులు వసూళ్లు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావటం లేదన్నారు. ప్రయివేటు డిమ్డ్‌ యూనివర్సిటీలతో ఎంఓయూ( మెమోరాండమ్‌ ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌)ఉందనే పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు అవగాహన కోసం నకిలీ యూనివర్సిటీల పేర్లను ప్రకటించాలని సూచించారు. విద్యార్థులను అలాంటి నకిలీ కళాశాలల్లో చేరొద్దని ప్రకటనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రే స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి నకిలీ యూనివర్సిటీలు వచ్చి వందల కోట్లు కొల్లగొడుతున్నా ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ సీట్లు నింపకముందే బి కేటగిరీ సీట్లను లక్షల రూపాయల డొనేషన్లు తీసుకుని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. బి కేటగిరీ సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలనీ, డొనేషన్లు వసూళ్లు చేస్తున్న కళాశాలను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధిక ఫీజులు తీసుకుంటున్న కళాశాలలపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేసి, విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -