డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి
నవతెలంగాణ – మునుగోడు : ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా అధిక ఫజులను వసూలు చేస్తున్న ప్రయివేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి టీ. మల్లేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి మాట్లాడుతూ..ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా చేసుకొని అమాయకమైనటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.
పాఠశాలల్లో చేరేంతవరకు వాళ్లకు కల్లబొల్లి మాటలు చెప్పి, పాఠశాలలో చేరిన తర్వాత ఫీజుల పేరుతోటి, బుక్స్, యూనిఫార్మ్స్ పేరుతోటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తాగుతున్నాయని మండిపడ్డారు. ఫీజుల నియంత్రణ పాటించకుండా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు ఫీజులు పెంచుకుంటూ పోతూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు 6 కాయలుగా సాగిస్తున్నారని తెలియజేశారు. బలపం పట్టలేని నర్సరీ విద్యార్థులకు కూడా వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాల పేరుతోటి ఐదు నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారని విమర్శించారు. యూనిఫార్మ్స్, స్టేషనరీ, షూ, బెల్టు అమ్మకాలు చేయవద్దని ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనలను తుంగలో తొక్కి యదేచ్చగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నాయని అన్నారు.
గత సంవత్సరం ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుకొని ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు కొంతమంది విద్యార్థులు వెళుతూ ఉంటే అలాంటి విద్యార్థుల దగ్గరికి వెళ్లి మీకు పూర్తి ఉచిత విద్యను అందిస్తామని మాయమాటలు చెప్పి మళ్లీ తమ ప్రయివేటు విద్యాసంస్థల్లో చేర్పించుకొని ఇప్పుడు ఫీజులు కట్టాలని ఆ యొక్క తల్లిదండ్రులను వేధిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న ప్రయివేటు విద్యాసంస్థలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో స్వయంగా పాఠశాలల ముందు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోటి కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్, మండల కమిటీ సభ్యులు రవి, బొడ్డుపల్లి చింటూ, చరణ్, శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.