జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ – భూపాలపల్లి: ప్రజావాణి లో వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనిజిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణిలో మొత్తం 64 దరఖాస్తు వచ్చాయని, వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు.
సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలం కషంగా పరిశీలించి, పెండింగ్ ఉంచకుండా, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాభవన్ హైదరాబాద్ నుండి వచ్చిన దరఖాస్తులకు పరిష్కారం చూపాలని తదుపరి నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయ లక్ష్మీ, ఆర్డిఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.