– భారత స్పందన కోసం ఎదురుచూపు
– అమెరికా కోర్టుకు ఎస్ఈసీ వెల్లడి
న్యూయార్క్ : అదానీ లంచాల అభియోగాల కేసులో ఇప్పటి వరకు భారత్ నుంచి స్పందన రాలేదని యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ), డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) అక్కడి న్యూయార్క్ కోర్టుకు సమాచారం ఇచ్చాయి. సెక్యూరిటీస్ మోసం, లంచం కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు నోటీసులు జారీ చేయడానికి భారత్ సాయం కోరినట్లు తెలిపాయి. ఈ విషయంలో 2025 ఏప్రిల్ 26 నాటికి భారత్ నుంచి స్పందన రాలేదని పేర్కొన్నాయి. ఈ కేసులో భారత్ తమ అభ్యర్థనను స్వీకరించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. భారత్లో ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో తమ ప్రాజెక్టులకు అనుకూలంగా వ్యవహరించేలా అదానీ గ్రూప్ లేదా గౌతం అదానీ సహా కొందరు వ్యక్తులు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలపై గతేడాది అమెరికా దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. తమకు అనుకూలమైన నిర్ణయాల కోసం అధికారులకు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2250 కోట్లు) లంచాలు ఇచ్చారని ప్రధాన ఆరోపణ. అమెరికాలో అదానీ గ్రూప్ లిస్టింగ్ కానప్పటికీ అక్కడి కంపెనీలు అదానీ గ్రూపులో పెట్టుబడులను కలిగి ఉన్నందున అక్కడి సంస్థలు దర్యాప్తు జరపడానికి వీలుండటంతో యూఎస్ కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే.
అదానీ లంచం కేసు..
- Advertisement -