న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)కు అదానీ పవర్ లిమిటెడ్ నుంచి భారీ ఆర్డర్ దక్కింది. రూ.6,500 కోట్ల విలువైన ఆర్డర్ను పొందింది. అదానీ పవర్కు చెందిన రారుపూర్, మిర్జాపూర్లోని థర్మల్ పవర్ ప్లాంట్ల కోసం 800 మెగావాట్ సామర్థ్యం గల రెండు సూపర్క్రిటికల్ థర్మల్ పవర్ యూనిట్లను భెల్ తయారు, సరఫరా, నిర్మాణం చేసి ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టులు అదానీ పవర్ శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచడంతో పాటు, దేశంలో విద్యుత్ డిమాండ్ను తీర్చనుందని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ ఆర్డర్ ఒప్పందంలో బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్లు, సంబంధిత ఇతర పరికరాల సరఫరాతో పాటు, వాటి స్థాపన, నిర్వహణ సేవలు కూడా ఉన్నాయి. ఈ ఒప్పందం భెల్కు ఆర్థికంగా బలమైన అవకాశంగా మారనుంది. ఇది కంపెనీ ఆదాయాన్ని పెంచడంతో పాటు తన మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. అదానీ పవర్తో ఈ భాగస్వామ్యం భెల్ సాంకేతిక నైపుణ్యం, నమ్మకమైన సేవలను మరోసారి రుజువు చేస్తుందని ఆ కంపెనీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఆర్డర్ దేశీయ విద్యుత్ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యాలకు అనుగుణంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇంధన భద్రతను మెరుగుపరచడంతో పాటు, స్థానిక ఉపాధి అవకాశాలను కూడా సృష్టించే అవకాశం ఉందన్నారు.