– ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ
– కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఆసిఫాబాద్
ఆదివాసుల హక్కులను కాలరాసి అటవీ ప్రాంతం నుంచి వెళ్లగొట్టేలా పులుల రక్షణ కోసం తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో శనివారం కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. అన్ని ప్రాంతాల నుంచి ఆదివాసులు పెద్దఎత్తున తరలొచ్చారు. జిల్లా నాయకులతో పాటు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. పులుల కారిడార్ కవ్వాల్ అభయారణ్యంలో భాగంగా ఉన్న ఆసిఫాబాద్ ప్రాంతాన్ని కుమురంభీమ్ పులుల కన్జర్వేషన్ రిజర్వుగా మారుస్తూ గత నెల 30న ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్ జీవో నెంబర్ 49 విడుదల చేశారు. ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, కాగజ్నగర్, సిర్పూర్, కర్జల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్ రేంజ్లలో లక్షా49వేల హెక్టార్లను టైగర్ రిజర్వ్లోకి మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. జీవో విడుదల కోసం 339 గ్రామాల ప్రజలతో చర్చించినట్టు జీవోలో పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ ఆదివాసీ సంఘం తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కోవ విజరు కుమార్ ఆధ్వర్యంలో ఆదివాసులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా కుమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి డప్పు చప్పుల మధ్య ర్యాలీ సాగింది. అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కొట్నాక్ విజరు మాట్లాడుతూ.. ఆదివాసుల ఓపికను పరీక్షించొద్దని, ఆదివాసులను అంతం చేసేలా తీసుకొచ్చిన జీవో 49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓపికను పరీక్షించాలని ప్రభుత్వం భావిస్తే అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించారు. నాగర్కర్నూల్, కవ్వాల్ ఉండగా అదనంగా ఆసిఫాబాద్ టైగర్ జోన్ ఎందుకని ప్రశ్నించారు. అటవీ అధికారుల బెదిరింపులకు చరమగీతం పాడే రోజు వచ్చిందన్నారు. అడవిని నాశనం చేసిందే వారని ఆరోపించారు. రాజకీయ నాయకులు ఆదివాసులను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారని, పార్టీ ఏదైనా విధానం అదే అని ఆరోపించారు. ఆదివాసులు ఐక్యమై పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ సిర్పూర్ ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.
జీవో 49రద్దుకుకదిలిన ఆదివాసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES