Wednesday, June 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'శాతవాహన' ఇంజినీరింగ్‌, లా కాలేజీల్లో అడ్మిషన్లు

‘శాతవాహన’ ఇంజినీరింగ్‌, లా కాలేజీల్లో అడ్మిషన్లు

- Advertisement -

– ఈ ఏడాది నుంచే ప్రవేశాలకు మంత్రివర్గం ఆమోదం
– ఇంజినీరింగ్‌ 240 సీట్లు..
– ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్‌ కోర్సులకు 60సీట్ల చొప్పున భర్తీ
– మారనున్న క్యాంపస్‌ వాతావరణం
– రెండు కాలేజీల ఏర్పాటుకు రూ.67 కోట్లకు పైగా నిధులు మంజూరు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

శాతవాహన యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఇంజినీరింగ్‌, లా కోర్సులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ కోర్సుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. పదేండ్లుగా కొత్త కోర్సులకు నోచుకోని ఈ యూనివర్సిటీకి, ఇంజినీరింగ్‌లో 240 సీట్లు (హుస్నాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ సీఎస్‌ఈ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఐటీ, ఈసీఈ బ్రాంచ్‌లు), లా కోర్సుల్లో (కరీంనగర్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌లో లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్‌) 120 సీట్లతో అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ రెండు కొత్త కాలేజీల నిర్మాణం, అభివృద్ధికి ప్రభుత్వం మొత్తం రూ.67.08 కోట్లు కేటాయించింది. వైస్‌ ఛాన్స్‌లర్‌ ఉమేశ్‌కుమార్‌ చేసిన ప్రతిపాదనలకు సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించడం, గత డిసెంబర్‌లో జీవోలు విడుదల చేయడం విశేషం. ఈ నిర్ణయం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయడమే కాకుండా, క్యాంపస్‌ వాతావరణాన్ని సమూలంగా మార్చనుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌ 18న రాష్ట్రంలోని 9 వర్సిటీలకు వైస్‌ చాన్స్‌లర్లను నియమించింది. ఇందులో భాగంగానే శాతవాహన వర్సిటీకి వీసీగా బాధ్యతలు స్వీకరించిన నెలన్నర రోజుల్లోనే ఉమేశ్‌కుమార్‌ పలు కీలకమైన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు పెట్టారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్‌, లా కాలేజీలు ఉన్నట్టే శాతవాహనలోనూ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి ఆమోదముద్ర వేసి పెద్దపల్లి బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాల, ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేస్తూ గతేడాది డిసెంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 18, 19 విడుదల చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్‌ కాలేజీ, కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్‌లో లా కళాశాల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. ఈ రెండు కాలేజీలు ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచి ప్రారంభిస్తామని చెప్పింది. ఇంజినీరింగ్‌ కాలేజీ నిర్మాణానికి రూ.44.12 కోట్లు కేటాయించగా, అందులో ప్రస్తుతం రూ.29.12 కోట్లు మంజూరు చేశారు. మిగతా రూ.15 కోట్లను తర్వాత మంజూరు చేయనున్నారు. శాతావాహన వర్సిటీలో ఏర్పాటు చేయనున్న లా కాలేజీలో మూడేండ్ల కోర్సు, రెండేండ్ల కోర్సు(మేధో సంపత్తి చట్టం)లో అడ్మిషన్లు ఇవ్వనుంది. ఈ కాలేజీ నిర్మాణానికి మొత్తం రూ.22.96 కోట్లు కేటాయించగా.. అందులో ప్రస్తుతం రూ.5 కోట్లు మంజూరు చేశారు. మొత్తంగా రూ.67.08 కోట్లను ప్రభుత్వం ఈ రెండు కాలేజీలకు కేటాయించింది.
ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు
హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో నాలుగు కోర్సులకుగాను 240 సీట్లతో అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్రపడింది. ఇంజినీరింగ్‌తోపాటు శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజీ ఏర్పాటులో భాగంగా ఎల్‌ఎల్‌బీ 60సీట్లు, ఎల్‌ఎల్‌ఎమ్‌ 60 సీట్ల భర్తీకి ఆమోదం తెలిపింది. మొత్తంగా హుస్నాబాద్‌లో యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ లో బీటెక్‌ సీఎస్‌ఈ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఐటీ, ఈసీఈ బ్రాంచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి.

పదేండ్లలో ఊసేలేని కొత్త కోర్సులు
2008లో కాంగ్రెస్‌ సర్కార్‌ హయాంలో శాతవాహన యూనివర్సిటీని 13 కోర్సులతో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించారు. తర్వాత ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ కోర్సు ప్రవేశపెట్టారు. గత పదేండ్లలో ప్రభుత్వం కొత్త కోర్సులు ప్రవేశపెట్టకపోగా.. బాటనీ, ఇంగ్లీష్‌, తెలుగు, మ్యాథ్స్‌ కోర్సులను రెగ్యులర్‌ కోర్సుల నుంచి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులుగా మార్చేసింది. క్యాంపస్‌లో లేదా బయటి యూనివర్సిటీ పీజీ కాలేజీల్లో ఇంజినీరింగ్‌, బీఈడీ, ఎంఈడీ, లా కాలేజీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉన్నప్పటికీ పట్టించుకోలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -