ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘హరి హర వీరమల్లు’. నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు నిర్మించారు. ఎ.ఎం.జ్యోతి కష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం నిర్వహించిన పాత్రి కేయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ”అజ్ఞాత వాసి’ సినిమాలో త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాశారు. ‘ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది’. అలాంటిది ఒక సినిమా చేయడమంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండు కరోనా పరిస్థితులు చూసింది. క్రియేటీవ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. దీంతో రత్నంలాంటి నిర్మాత నలిగిపోతుంటే నాకు బాధేసింది. ఇది డబ్బు గురించో, విజయం గురించో కాదు.. మన వాళ్ళ కోసం, సినీ పరిశ్రమ కోసం నమ్మి నిలబడటం. పైగా ఆయనలాంటి వాళ్ళు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటే పరిశ్రమకు బాగుటుందనే ఉద్దేశ్యంతో రత్నం పేరుని ముఖ్యమంత్రి చంద్ర బాబుకి ప్రతిపాదించాను. కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా పూర్తి చేయలేకపోయినప్పటికీ.. ఒక మంచి కాన్సెప్ట్తో ఈ సినిమాకి పునాది వేసిన ఆయనకు మనస్ఫూర్తిగా కత్ఞజ్ఞతలు. ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అని మాటలు వినిపిస్తున్న సమయంలో.. మాకు ప్రాణవాయువు ఇచ్చిన వ్యక్తి కీరవాణి. దర్శకుడు జ్యోతికృష్ణ అద్భుతంగా సినిమాని తెరకెక్కించారు. మా విజన్ని సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస అత్యద్భుతంగా చూపించారు. సినిమా అనేది మన జీవితంలో ఎంతో కొంత ప్రభావాన్ని చూపించాలి. అలాంటి ప్రభావాన్ని, ఎనర్జీని ఇచ్చే సినిమా ఇది’ అని చెప్పారు.