బీజేపీ కార్పొరేట్, కమ్యూనల్ ఎజెండాతో పాలన : వ్యవసాయ కార్మిక సంఘం సభలో అమ్రారామ్, బి. వెంకట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, గ్రామీణ పేదలు ఐక్యం కావాలని లోక్సభ ఎంపీ అమ్రారామ్, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ పట్టణంలో గురువారం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) 9వ రాష్ట్ర మహాసభ ఘనంగా ప్రారంభమైంది. భారీ బహిరంగ సభలో అమ్రారామ్, బి. వెంకట్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తూ గ్రామీణ పేదల జీవనాన్ని ధ్వంసం చేస్తున్నా యని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీన పరచి, గ్రామీణ కార్మికులను నిరుద్యోగం, వలసలబాట పట్టేలా చేస్తున్నాయని విమర్శిం చారు. భూ పంపిణీ పూర్తిగా నిలిచిపోయిందని, పైగా ‘అభివృద్ధి’ పేరుతో పేదల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకొని కార్పొరేట్లకు అప్పజెప్తున్నాయన్నారు.
దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయ న్నారు. మతం, కులం పేరుతో హింసను ప్రోత్స హిస్తున్నాయని విమర్శించారు. దేశ సంపదను అదానీ, అంబానీ వంటి కొద్ది మంది ధనికులకు అప్పగించి, రైతులు, కూలీలను బానిసలుగా మార్చే కుట్ర కొనసాగుతోందని దుయ్యబట్టారు. రాజ్యాంగ సంస్థలపై దాడులు, ప్రజాస్వామ్యాన్ని బలహీన పరచే చర్యలు విపరీతంగా పెరిగాయన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ ‘గుజరాత్ మోడల్’ ను ప్రచారం చేసిందని, గుజరాత్ మోడల్ అంటే కొద్ది మంది కార్పొరేట్ల కోసం పేదల దోపిడీ మోడల్ మాత్రమేనని విమర్శించారు. కేరళ మోడల్ మాత్రం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతూ, ప్రజల కోసం విద్య, ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తోందని పేర్కొన్నారు. కాబట్టి కేరళ ప్రభుత్వ విధానాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.