టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్
న్యూఢిల్లీ: నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళలకే కాకుండా అందరికీ ఆదర్శనీయమని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ జయంతిని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ నిజాం పాలకుల కింద పనిచేసే రజాకార్లకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం చేశారని గుర్తు చేశారు. ఐలమ్మ దైర్యసాహసాలు అందరికీ స్ఫూర్తినిస్తాయన్నారు. త్యాగం అంటే ఏమిటో దైర్యంతో పోరాడితే మనం సాధించుకోలేనిది ఏదీ ఉండదని నిరూపించిన మహిళ ఐలమ్మ అన్నారు. ఈతరం పిల్లలు పెద్దవ్వగానే వారి చదువులు ఆ తర్వాత వారి ఉద్యోగాలు, వారి కుటుంబం, వారి స్వార్ధం తప్ప సమాజం కోసం అలోచించే వారు లేరని, మెజార్టీ యువత ఇలాగే ఉందన్నారు.
ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన సమాజం కోసం ఏం చేయాలో ఎలా చేయాలో ఐలమ్మ చరిత్రను చదివితే అర్ధం అవుతుందని అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధపోరాటంలో ఐలమ్మ, దొడ్డికొమరయ్య, కొమురంభీమ్ వంటి ఎందరో మహానుభావులు రజాకార్లతో జరిగిన పోరాటంలో అసువులుబాసారని అన్నారు. వారందరి చరిత్ర చదవాలన్నారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త గౌరవ్ ఉప్పల్, పలువురు నేతలు, తెలంగాణ భవన్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఐలమ్మ పోరాటం అందరికీ ఆదర్శం
- Advertisement -
- Advertisement -