ఏడాదిలో 44 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : వేసవి సెలవుల వేళ విమాన ప్రయాణికులకు గట్టి షాక్ తగిలింది. అంతర్జా తీయ పరిణామాలు, రూపాయి పతనం, చమురు ధరల పెరుగుదలతో విమాన టికెట్ల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. గతేడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో దేశీయ విమాన ఛార్జీలు సగటున 44 శాతం మేర పెరిగాయి. ప్రముఖ ట్రావెల్ పోర్టల్ క్లియర్ ట్రిప్ డేటా ప్రకారం.. 2025 ఏప్రిల్లో సగటున రూ.5,850గా ఉన్న దేశీయ విమాన టికెట్ ధర.. 2026 ఏప్రిల్ నాటికి రూ.8,450కి చేరుకుంది. కేవలం దేశీయ ప్రయాణాలే కాకుండా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు కూడా సామాన్యులకు భారంగా మారాయి. అంతర్జాతీయ ఛార్జీలు సుమారు 43 శాతం మేర పెరిగి సగటు టికెట్ ధర రూ.52,000 నుండి రూ. 74,500కి చేరింది. విమానయాన సంస్థలపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఛార్జీల గరిష్ట పరిమితులను తొలగించడంతో పాటు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్)పై రాయితీలను ప్రకటించింది. అయినప్పటికీ విమాన ఇంధన ధరల పెరుగుదల, కరెన్సీ ఒత్తిడి, గగనతల ఆంక్షల వల్ల ఎయిర్లైన్స్ సంస్థల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ప్రభుత్వం ఈ రాయితీలు ఇవ్వకపోయి ఉంటే ధరలు మరిన్ని రెట్లు పెరిగే అవకాశం ఉండేదని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ విమానాల సంఖ్య తగ్గడం, ఇంధన సర్ఛార్జీలు తోడవడంతో ప్రయాణికులకు ఉపశమనం లభించడం లేదు.
విమాన ప్రయాణం భారం..
- Advertisement -
- Advertisement -



