Sunday, January 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమహాజాతరకు సర్వంసిద్ధం

మహాజాతరకు సర్వంసిద్ధం

- Advertisement -

నూతన హంగులతో సమ్మక్క,సారలమ్మ గద్దెలు
శోభాయమానంగా ముస్తాబవుతున్న మేడారం
తుదిదశకు చేరుకున్న ఏర్పాట్లు
పనుల్లో నిమగంకానున్న 21 శాఖలు…42,027 మంది
క్షేత్రస్థాయి నుంచే పనులను పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం
మూడు కోట్ల మంది దర్శించుకునే అవకాశం
కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర సర్కారు సర్వం సిద్ధం చేస్తున్నది. భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టింది. తల్లుల దర్శనానికి కోట్లాది భక్తులు వచ్చే ఈ మహా పర్వంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈ ఏర్పాట్లన్నింటిపై నిత్యం ప్రత్యక్ష పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర మంత్రులు, అధికార యంత్రాంగం మేడారంలోనే బస చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం, సుభిక్ష దర్శనం ప్రథమ ప్రాధాన్యతగా మారింది. ఈ సారి సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాతో, ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు కలిసి సమగ్ర ప్రణాళికతో పని చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది, మేడారం పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు. వారికి అదనంగా రెండు వేల మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా తమ సేవలు అందించనున్నారు.

సెల్‌ఫోన్ల సిగల్స్‌కు అంతరాయం కలుగకుండా…
మొబైల్‌ నెట్‌వర్క్‌కి అంతరాయం కలగకుండా 27 శాశ్వత టవర్లతో పాటు తాత్కాలిక పద్దతిలో 33 టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని ఎనిమిది పరిపాలనా జోన్లుగా, 42 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో జోన్‌కు జిల్లా స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ఒక్కో సెక్టార్‌కు మండల స్థాయి అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్‌, ఊరట్టం, శివరాం సాగర్‌, నర్లాపూర్‌, పడిగాపూర్‌ వంటి అన్ని కీలక ప్రాంతాల్లో కంట్రోల్‌ రూములు, మిస్సింగ్‌ పర్సన్స్‌ క్యాంపులు, అత్య వసర స్పందన బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇబ్బందులు తలెత్తకుండా…
భక్తులు సులభంగా మేడారానికి చేరుకునేందుకు టీజీఆర్టీసీ ఈసారి 4000 బస్సులను వినియోగంలోకి తెచ్చి 51,000 ట్రిప్పులు నిర్వహిస్తోంది. ప్రత్యేక బస్టాండ్లు, ప్రత్యేక రూట్లతో రవాణా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహిస్తున్నారు. జాతర కోసం 10441 మంది ఆర్టీసీ సిబ్బంది సేవలందించనున్నారు. గంటకు 15 బస్సులు ప్రయాణించేలా ప్లాన్‌ చేస్తున్నారు. రాకపోకల్లో ఇబ్బందులు రాకుండా మొత్తం 525 చోట్ల రహదారి సమస్యలను గుర్తించి పరిష్కరించారు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మత్తులు, కల్వర్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. వాహనాల రద్దీ తగ్గించేందుకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్‌ ప్రాంతాలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్‌ భగీరథ ద్వారా నిరంతం తాగు నీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 5,482 తాగు నీటి నల్లాలు ఏర్పాటు చేసి భక్తులకు శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నారు.

జంపన్నవాగులో పవిత్ర స్నానాలు చేసే భక్తుల కోసం 119 డ్రెస్సింగ్‌ రూములు ఏర్పాటు చేయడంతో పాటు నీటి పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్‌ చేయనున్నారు. 285 బ్లాకుల్లో 5700 టాయిలెట్లను సిద్దం చేశారు. వాటికి అధనంగా మొబైల్‌ టాయిలెట్స్‌ను అందుబాటులోకి తేనున్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం ఐదు వేల మంది సిబ్బందిని, 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్‌ మిషిన్లు, 12 జేసీబీ, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లను రంగంలోకి దింపారు. జాతర ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా అంతరాయం లేకుండా టీజీఎన్‌పీడీసీఎల్‌ ద్వారా 196 ట్రాన్స్‌ఫార్మర్లు, 911 విద్యుత్‌ స్తంభాలు, 65.75 కిలోమీటర్ల విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ అంతరాయం తలెత్తకుండా 350 మంది సిబ్బందిని నియమించారు. ఆలయాలు, ప్రధాన మార్గాలు, పార్కింగ్‌ ప్రాంతాల్లో వేల సంఖ్యలో హై పవర్‌ లైట్లు వెలుగులు పంచుతుండగా, అత్యవసర పరిస్థితుల కోసం 28 డీజిల్‌ జనరేటర్లు బ్యాకప్‌గా సిద్ధంగా ఉన్నాయి.

ఆరోగ్య సేవలు, ప్రమాదాల నివారణపై ఫోకస్‌
జాతర సమయంలో ఆరోగ్య సేవల కోసం మొత్తం 5,192 మంది వైద్య సిబ్బందిని నియమించారు. భక్తులకు సేవలందించేందుకు 30 అంబులెన్సులు, 40 బైక్‌ అంబులెన్సులు, 50 పడకల ప్రధాన ఆస్పత్రి, రోజుకు 30 మెడికల్‌ క్యాంపులు పనిచేస్తాయి. జంపన్నవాగులో ప్రమాదాలను నివారించేందుకు 210 మంది గజ ఈతగాళ్లు, 12 మంది సింగరేణి రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపింది. 100 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేయనున్నాయి. అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు 15 ఫైర్‌ బ్రిగేడ్‌ వాహనాలు, 268 మంది ఫైర్‌ ఫైటర్లు సిద్ధంగా ఉన్నారు.

అటవీ శాఖ ద్వారా పార్కింగ్‌, రోడ్లతో పాటు పర్యావరణ సంరక్షణ చేపడుతుండగా, ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులకు కొబ్బరి కాయ, బెల్లం, ఇతర వ్యాపారాల కోసం లైసెన్సులు ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. మొత్తంగా మేడారం మహాజాతర-2026ను ప్రపంచ స్థాయిలో నిర్వహించాలనే లక్ష్యంతో, అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు త్వరితగతిన తల్లుల దర్శనం, సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది.

అత్యాధునిక వసతులతో మీడియా సెంటర్‌
మేడారం మహా జాతర విశేషాలను దేశ విదేశీ భక్తులకు అనుక్షణం, ఎప్పటికప్పుడు అందించుటకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, ఇతర ప్రచార, ప్రసార మాద్యమాల సౌకర్యార్ధం కోసం రాష్ట సమాచార పౌర సంబంధాల ఆధ్వర్యంలో అమ్మవార్ల గద్దెల పక్కన ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీడియా సెంటర్‌ నుండి, ఫోటోలు, వీడియోలు, వార్తలు నేరుగా పంపించుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. 20 హై కన్ఫ్రిగేషన్‌ కంప్యూటర్లను, జీరాక్స్‌ మిషన్‌, ఫ్యాక్స్‌, ప్రింటర్లతో పాటు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పించనున్నది. మీడియా ప్రతినిధులకు భోజన వసతులను కూడా ప్రభుత్వమే కల్పించనున్నది.

రవాణా – పార్కింగ్‌
పార్కింగ్‌ స్థలాలు : 42
మొత్తం విస్తీర్ణం : 1,418 ఎకరాలు
టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు : 4,000
మొత్తం ట్రిప్పులు : 51,000
ఆర్టీసీ సిబ్బంది : 10,441

మేడారం మహా జాతర ప్రత్యేకతలివే..
భక్తులు : మూడు కోట్ల మంది వరకు వచ్చే అవకాశం
విధుల్లో సిబ్బంది : 21 శాఖలు, 42,027 మంది
ఆదివాసీ వాలంటీర్లు : 2,000 మంది
పరిపాలనా విభజన : 8 జోన్లు, 42 సెక్టర్లు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -