హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్
సబ్ యూనిట్ అధికారి నాందేవ్
నవతెలంగాణ – జన్నారం : మండలంలోని కవ్వాల్ గిరిజన బాలికా ఆశ్రమ పాఠశాలలో గురువారం సికిల్ సెల్ అనీమియా పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్ ఫెసిలిటేటర్లుగా పాల్గొని విద్యార్థులకు సికిల్ సెల్ అనీమియా రుగ్మత గురించి వివరణాత్మకంగా వివరించారు. హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్ మాట్లాడుతూ .. “సికిల్ సెల్ అనీమియా ఒక జెనిటిక్ (వంశపారంపర్య) రక్త వ్యాధి. ఈ వ్యాధిలో ఎర్ర రక్త కణాలు వక్రాకారంలోకి ( కొడవలి ఆకారంలోకి) మారి రక్త ప్రసరణలో ఆటంకం కలిగిస్తాయన్నారు.
ఇది ప్రధానంగా గిరిజన సమాజాల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ముందస్తుగా రక్త పరీక్షలు చేయించుకోవడం, వైద్య సలహాలు పాటించడం ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు” అని వివరించారు. సబ్ యూనిట్ అధికారి నాందేవ్ మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, బోదకాలు, మెదడు వాపు వ్యాధులను సంక్రమించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
అన్ని గిరిజన పాఠశాలల్లో సికిల్ సెల్ అనీమియా నిర్దారణకై రక్త పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గిరిజన బాలికా ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ చందర్,సూపర్ వైసర్ రాంబాబు, ఎం ఎల్ హెచ్ పీ మౌనిక,ఏ ఎన్ ఎం స్రవంతి, హెల్త్ అసిస్టెంట్ కమలాకర్,ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.