ఈ-కార్ రేసింగ్ కేసుపై ప్రభుత్వానికి ఏసీబీ లేఖ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో నిందితులను ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతినివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ఈ-కార్ రేసింగ్కు సంబంధించి దర్యాప్తు పరంగా అనేక వివరాలను, ఆధారాలను నిందితుల నుంచి సేకరించటం జరిగిందని ఈ సందర్భంగా లేఖలో ఏసీబీ అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ-కార్ రేసింగ్ను నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా దీని నిర్వహణ కోసం ఇంగ్లాండ్కు చెందిన కంపెనీకి రూ.54 కోట్లను చెల్లించారనీ, అయితే ఇందుకు ప్రభుత్వపరమైన నిబంధనలు, మార్గదర్శకాలను ఏ మాత్రమూ పట్టించుకోలేదని కూడా వివరించినట్టు సమాచారం. ముఖ్యంగా హెచ్ఎండీఏ నుంచి కార్ రేసింగ్ను నిర్వహించటానికి గానూ రూ.54 కోట్ల మేర చెల్లింపులు జరిపారనీ, ఈ విషయంలో ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులూ పొందలేదనీ, అందుకు గానూ రూ.7 కోట్లను జరిమానాగా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి విధించిందని కూడా పేర్కొన్నారని తెలిసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దర్యాప్తును చేపట్టి ఈ-కార్ రేసింగ్తో సంబంధమున్న అప్పటి రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా, అప్పటి హెచ్ఎండీఏ డైరెక్టర్, ప్రస్తుత సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను రెండో నిందితుడిగా, హెచ్ఎండీఏ సీఎఫ్ఓ బి.రెడ్డిని మూడో నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేసింది. పైన పేర్కొ న్నవారితో పాటు ఈ-కార్ రేసింగ్ను నిర్వహించిన ఇంగ్లాండ్ కంపెనీ నెక్స్ట్ జెన్ సీఈఓ కిరణ్లను కూడా విచారించింది. మొత్తమ్మీద తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నిందితులను ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతులివ్వాలని తాజాగా ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు లేఖ రాసినట్టు తెలిసింది. దీనిపై ప్రభుత్వం ఇచ్చే అనుమతి కోసం ఏసీబీ అధికారులు ఎదురు చూస్తున్నట్టు సమాచారం.