మండల విద్యాశాఖ అధికారి హరిశ్చంద్ర
పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన
విద్యార్థుల భవిష్యత్కు అధికారుల భరోసా
నవతెలంగాణ- కంటోన్మెంట్
మత్తు పదార్థాల తయారీ కేసులో సీజ్ అయిన మేధా పాఠశాల విద్యార్థుల భవితకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు బాలానగర్ మండల విద్యాధికారి హరిశ్చంద్ర తెలిపారు. పాఠశాలను ఆదివారం సీజ్ చేయగా.. సోమవారం ఉదయం పరీక్షలు ఉన్నాయని తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాలకు రావడంతో అక్కడ ఆందోళన వాతావరణ నెలకొంది. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనకు దిగడంతో అధికారులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. మేధా పాఠశాలను సీజ్ చేసినట్టు తమకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. పరీక్షలు నిర్వహిస్తారని పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చినట్టు చెప్పారు. పాఠశాలలో మత్తు పదార్థాలు తయారు చేయడం దారుణమన్నారు. తమ పిల్లల భవిష్యత్పై ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు టీసీ ఇస్తే ఇతర పాఠశాలల్లో చేర్పించుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. పాఠశాల యజమాని, కరస్పాండెంట్ ప్రకాష్ గౌడ్ రిమాండ్లో ఉండటం వల్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సమీప పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పది ఏండ్లుగా పాఠశాలను నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం 63 మంది విద్యార్థులు ఉన్నారని ఎంఈఓ తెలిపారు. ఇప్పటికే పాఠశాల అనుమతులను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు.
‘మేధా’ విద్యార్థుల భవితకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES