Friday, October 10, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅమెరికా, భారత్‌ మధ్య ఆర్థికవృద్ధికి సహకరించాలి

అమెరికా, భారత్‌ మధ్య ఆర్థికవృద్ధికి సహకరించాలి

- Advertisement -

నిర్ణయాలు, విధానాలు సంబంధాలు పెంచేలా ఉండాలి
సుంకాల పెంపు, హెచ్‌1 బీ వీసాకు నిబంధనలపై సీఎం ఆందోళన
అమెరికా ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమెరికా, భారత్‌ మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు సానుకూల దృక్పథంతో రెండు దేశాల మధ్య సంబంధాల ను మరింత పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవల అమెరికా పెంచిన సుంకాలు, హెచ్‌1 బీ వీసాలపై విధించిన కఠిన నిబంధనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయటంతో పాటు అస్థిరతకు, అపార్థానికి దారి తీస్తాయన్నారు. తెలంగాణకు వచ్చిన అమెరికా ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. వారితో గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్‌ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదనీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఉత్తమమైన విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్‌ ప్రపంచ నగరంగా అందరినీ ఆకర్షిస్తోందనీ, దేశ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ ఇప్పుడు న్యూయార్క్‌, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీ పడుతోందనీ, ఇక్కడ మౌలిక సదుపాయాలు, తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ప్రపంచ ప్రమాణాలకు సవాలుగా ఉందని ఆయన అన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందనీ, 2034 నాటికి ఒక ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పారు.

2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి వారికి తెలిపారు. హైదరాబాద్‌లో గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్టులు చేపడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీతో పాటు రీజినల్‌ రింగ్‌ రోడ్‌, రీజినల్‌ రింగ్‌ రైల్‌, మాన్యుఫాక్చర్‌ జోన్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. డ్రై పోర్ట్‌ ఏర్పాటు చేసి పొరుగున ఉన్న ఏపీలో మచిలీపట్నం పోర్ట్‌ వరకు 12 లేన్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే, రైల్‌ కనెక్టివిటీ ఉండేలా రవాణా సదుపాయాలు విస్తరిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ నుంచి చైన్నై వరకు, హైదరాబాద్‌ నుంచి బెంగుళూరుకు బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయన్నారు. హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టామనీ, సిటీలో ఇప్పుడున్న మెట్రో రైలును అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్టు చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి కొత్త మార్గాలను తెరుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

30 వేల ఎకరాల్లో హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వామ్యాన్ని, మద్దతును ఆహ్వానిస్తున్న ట్టు సీఎం తెలిపారు. ఇప్పటికే ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయనీ, మొత్తం 500 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావాలనీ, ఫ్యూచర్‌ సిటీలో పాలుపంచుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘చైనా ప్లస్‌ 1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందనీ, అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని అన్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఏఐ సిటీతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలున్నాయని తెలిపారు. ఏఐ రంగంలో రాష్ట్రాన్ని దేశానికే స్కిల్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఇప్పటికే పేరొందిన కంపెనీలు హైదరాబాద్‌లో గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్స్‌ ఏర్పాటు చేశాయనీ, వీటిని గ్లోబల్‌ వాల్యూ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజరు కుమార్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రిజ్వీ, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ, ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌ కె. శశాంక, ఇండిస్టిస్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా ప్రతినిధి బృందంలో హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధి, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కాలమిస్ట్‌ ప్రొఫెసర్‌ వాల్టర్‌ రస్సెల్‌ మీడ్‌, రేషనల్‌ వేవ్‌ క్యాపిటల్‌ పార్టనర్స్‌ సీఈవో మార్క్‌ రోసెన్‌బ్లాట్‌, క్రౌ హౌల్డింగ్స్‌ చైర్మెన్‌ హర్లాన్‌ క్రో, ఈగిల్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థాపకుడు రావెనెల్‌ కర్రీ, బిల్లింగ్స్లీ కంపెనీ భాగస్వామి హెన్రీ బిల్లింగ్సీతో పాటు మొత్తం 16 మంది ఉన్నారు. ఇండియా ఫౌండేషన్‌ సారధ్యంలో ఈ ప్రతినిధి బృందం భారత్‌లో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై ఈ బృందం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలను స్వీకరిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -