– చైనాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం
– సుంకాలకు 90 రోజుల విరామం
– టారిఫ్లు 115 శాతం తగ్గింపు
– అమెరికా, చైనా నిర్ణయం
– ప్రతికూలతల నేపథ్యంలో
– వెనక్కి తగ్గిన ట్రంప్ ప్రభుత్వం
జెనీవా: అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనా మధ్య స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన వాణిజ్య చర్చలు ఫలప్రదమయ్యాయి. సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్నామని రెండు దేశాలు సోమవారం నాడు ఓ సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. ప్రస్తుత టారిఫ్ రేట్లను గణనీయంగా తగ్గించాలని కూడా నిర్ణయించామని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెస్సెంట్ చెప్పారు. రెండు దేశాలు తమ సుంకాలను 115 శాతం మేర తగ్గిస్తాయని ఆయన అన్నారు. తొంభై రోజుల విరామ సమయంలో చైనా దిగుమతులపై సుంకాలను 145 శాతం నుంచి 30శాతానికి తగ్గించాలని అమెరికా నిర్ణయించింది. అలాగే చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై తాను విధించిన టారిఫ్లను 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించేందుకు అంగీకరించింది. ఈ నిర్ణయాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. ’90 రోజుల విరామంపై మేము ఓ ఒప్పందానికి వచ్చాము. సుంకాల స్థాయిని గణనీయంగా తగ్గించాలని కూడా నిర్ణయించాము’ అని బెస్సెంట్ వివరించారు. చైనాతో చర్చలు నిర్మాణాత్మకంగా సాగా యని, రెండు దేశాలు గొప్ప గౌరవాన్ని ప్రదర్శించాయని చెప్పారు. భవిష్యత్తులో ఉద్రిక్తతలు తలెత్తకుండా నివారించేందుకు అమెరికా, చైనాలు సమర్థవంతమైన ప్రొటోకాల్స్ను ఏర్పాటు చేశాయని అన్నారు. కాగా గత నెల 2వ తేదీ నుంచి అమలు చేసిన టారిఫ్యేతర ప్రతీకార చర్యలను నిలిపివేయాలని కూడా తాము భావిస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
అమెరికా, చైనా మధ్య సుంకాలపై ఒప్పందం కుదిరిన నేపథ్యంలో చమురు ధరలు మూడు శాతం పెరిగాయి. ఒప్పందాన్ని స్టాక్ మార్కెట్లు స్వాగతించాయి. రెండు దేశాల మధ్య ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని నివారించవచ్చునని ఇన్వెస్టర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. హంగ్కాంగ్లోని హాంగ్సెంగ్ సూచీ సోమవారం 3.34 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సూచీ 762.94 పాయింట్లు ఎగబాకి 23,630.68 పాయింట్లకు చేరింది. యూరోపియన్ స్టాక్ మార్కెట్లు కూడా మంచి ఫలితాలు సాధించాయి. ప్రధాన అమెరికా స్టాక్ మార్కెట్లు రెండు శాతం వృద్ధితో ప్రారంభమయ్యాయి. రెండు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. బెస్సెంట్, చైనా ఉప ప్రధాని హీ లిఫెంగ్ మధ్య గత వారాంతంలో రహస్యంగా చర్చలు జరిగాయి. చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీగా సుంకాలు విధించిన తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే. చర్చలు లోతుగా, నిజాయితీగా జరిగాయని లిఫెంగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ తన సుంకాల విధానాన్ని ప్రకటించినప్పటి నుంచి అమెరికా, చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉద్రిక్తతలను తగ్గించడమే తన ముందున్న లక్ష్యమని బెస్సెంట్ ఇటీవలే తెలిపారు. కాగా ప్రతిష్టంభనను తొలగించాలని రెండు దేశాలు కోరుకుంటున్నా యన్న విషయాన్ని ఈ ఒప్పందం రుజువు చేస్తోంది.
గొప్ప పురోగతి : ట్రంప్
ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు జరిగిన చర్చల సందర్భంగా మంచి ఫలితాలు సాధించామని బెస్సెంట్ అంతకుముందు సంతృప్తి వ్యక్తం చేశారు. చర్చల అనంతరం బెస్సెంట్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జమైసన్ గ్రీర్ జెనీవాలోని స్విస్ ఐరాస రాయబారి నివాసం వద్ద ఆదివారం విలేకరులకు క్లుప్తంంగా సమాచారాన్ని అందించారు. అయితే పాత్రికేయుల ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వలేదు. కాగా చర్చలలో ‘గొప్ప పురోగతి సాధించాము’ అని ట్రంప్ తొలుత తన సామాజిక మాధ్యమ వేదికలో వ్యాఖ్యానించారు. సుంకాల తగ్గింపు ఆశించిన దాని కంటే అధికంగా ఉన్నదని బీబీసీ ప్రతినిధి తెలిపారు.
మెట్టు దిగిన అమెరికా
గత నెలలో అమెరికా, చైనా మధ్య సుంకాల సమరం మొదలైన విషయం తెలిసిందే. చైనా దిగుమతులపై అమెరికా 145 శాతం టారిఫ్ విధించగా, బీజింగ్ కూడా తగ్గేదేలే అన్నట్టు అమెరికా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధించింది. అమెరికాకు ‘రేర్ ఎర్త్’ల ఎగుమతులపై ఆంక్షలు కూడా విధించింది. అయితే అమెరికా ఆ తర్వాత బెట్టు వీడి మెట్టు దిగింది. వాణిజ్య చర్చలు త్వరగా ప్రారంభిద్దామని చైనాకు సూచించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. చైనా నుంచి దిగుమతి అవుతున్న కొన్ని వస్తువుల ధరలు సుంకాల కారణంగా పెరిగిపోయాయి. దీంతో అమెరికా ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. ట్రంప్ వాణిజ్య యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం రెట్టింపై ఈ సంవత్సరాంతానికి నాలుగు శాతానికి చేరుతుందని విశ్లేషకులు హెచ్చరించారు. అధిక సుంకాల కొనసాగింపు కారణంగా అమెరికా అనేక రకాల ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చైనాతో ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ప్రభావం ఇప్పటికే కన్పిస్తోంది. చైనా నుండి దిగుమతులు బాగా తగ్గిపోతున్నాయని పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్ ఫ్రైట్ హ్యాండర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాల్మార్ట్, టార్గెట్ వంటి రిటైలర్లు కూడా అధిక ధరలపై హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య ప్రతిష్టంభన విషయంలో చైనా ఎంతో స్థిరత్వాన్ని ప్రదర్శించింది. చైనాలో ఇప్పటికే ఆర్థిక, ద్రవ్య చర్యల కలయికతో కూడిన ఉద్దీపన ప్యాకేజీ అమలులో ఉంది. భవిష్యత్తులో కూడా బీజింగ్ దానిని కొనసాగించగలదు.
ఈ విషయంలో అమెరికాలో ప్రతికూలతలు ఉన్నాయి. తన మొదటి పదవీకాలంలో ప్రకటించిన కార్పొరేట్ పన్ను రాయితీలను కొనసాగించడం తప్ప ట్రంప్నకు ఇప్పుడు మరో మార్గం లేదు. వడ్డీ రేట్ల తగ్గింపుపై ట్రంప్ ప్రభుత్వానికి, అమెరికా కేంద్ర బ్యాంకుకు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాణిజ్య యుద్ధ ప్రభావం నుంచి బయటపడే అవకాశాలు అమెరికా కంటే చైనాకే ఎక్కువగా ఉన్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ప్రధాన ఆర్థిక వ్యాఖ్యాత మార్టిన్ ఊల్ఫ్ చెప్పారు. అమెరికా రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు అంత పటిష్టవంతంగా లేవని ఆయన అన్నారు. మార్కెట్ల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదని, వాణిజ్య యుద్ధం అమెరికాను తీవ్రంగా నష్టపరిచిందని తెలిపారు. అమెరికా సరఫరా వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని కూడా ఆయన అన్నారు.
మెట్టు దిగిన అమెరికా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES