Saturday, July 5, 2025
E-PAPER
Homeజాతీయంభారత మార్కెట్లకు అమెరికా సంస్థ టోకరా

భారత మార్కెట్లకు అమెరికా సంస్థ టోకరా

- Advertisement -

– రూ.43 వేల కోట్లు సంపాదించిన జెన్‌ స్ట్రీట్‌
– ఎట్టకేలకు నిషేధం విధించిన సెబీ
ముంబయి :
భారత స్టాక్‌ మార్కెట్లలోని లొసుగులను ఆధారంగా చేసుకొని అమెరికా ట్రేడింగ్‌ సంస్థ జెన్‌ స్ట్రీట్‌ భారత మార్కెట్లో భారీ మొత్తాన్ని టెక్నికల్‌గా కొల్లగొట్టింది. ఎట్టకేలకు ఇది బయట పడటంతో ఆ సంస్థ భారత మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది. అదే విధంగా జెన్‌స్ట్రీట్‌ సంపాదించిన లాభం మొత్తాన్ని ఎస్క్రో అకౌంట్స్‌లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా క్యాష్‌ మార్కెట్లలో షేర్ల ధర స్వల్ప పెరుగుదల కూడా షేరు ఆప్షన్స్‌పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అదే విధంగా మార్కెట్‌ సూచీల్లో భాగమైన షేర్ల ధరలు క్యాష్‌, ఫ్యూచర్స్‌లో పెరిగినా లేదా తగ్గినా సదరు ఇండెక్స్‌ ఆప్షన్స్‌ విలువలో ఎక్కువ మార్పులు చోటు చేసుకొంటాయి. ఈ విషయాన్ని గ్రహించిన జెన్‌ స్ట్రీట్‌ పలు వ్యూహాలతో భారత మార్కెట్లో ట్రేడింగ్‌ చేసింది. మోసపూరిత ఈ ట్రేడింగ్‌ల కోసం భారత్‌లో జెన్‌ స్ట్రీట్‌ ఆసియా ట్రేడింగ్‌ లిమిటెడ్‌, జెన్‌ స్ట్రీట్‌ ఇండియా ట్రేడింగ్‌ ప్రయివేటు లిమిటెడ్‌, జెన్‌ స్ట్రీట్‌ ఆసియా ఎల్‌ఎల్‌సీ అనే సంస్థలను రిజిస్టర్‌ చేసింది. ఒక కంపెనీ షేర్లను పెంచడం, తగ్గించడం చేసి దాని ఆధారంగా ఆప్షన్స్‌ సూచీల్లో ట్రేడింగ్‌ చేసి భారీగా కొల్లగొట్టింది. ఈ విధంగా 2023 జనవరి నుంచి 2025 మార్చి 31 వరకు రూ.43,289 కోట్ల లాభాలను సంపాదించింది. కేవలం 21 రోజుల్లో రూ.4,843 కోట్ల ఆదాయాలను సంపాదించిందని సెబీ ప్రాథమికం గా గుర్తించింది. 2024 జనవరి 17వ తేదీ సహా మరో 14 బ్యాంక్‌ నిఫ్టీ ఎక్స్‌పైరీ డేట్లలో జేన్‌ స్ట్రీట్‌ అనుసరించిన విధానాలను సెబీ విశ్లేషించి.. ఈ మోసాన్ని గుర్తించింది. ఒక సంస్థ క్యాష్‌, ఫ్యూచర్‌ మార్కెట్లలో ఆర్డర్లు పెట్టడం, లావాదేవీలు చేయడం చేస్తుంటే.. అదే సమయంలో మరో సంస్థ ఆప్షన్స్‌ మా ర్కెట్లో దానికి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించేదని సెబీ విశ్లేషించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -