– ‘అమ్మా సేవా సదన్’ నిర్వాహకురాలి మృతిపై మిన్నంటిన రోదనలు
– నివాళులర్పించిన బీ ఆర్ఎస్ మహిళా నాయకురాలు నాగశేషపద్మ
నవతెలంగాణ – అశ్వారావుపేట
నిరాశ్రయులైన వందలాది వృద్ధులకు ఆశ్రయం ఇచ్చి,వారి పాలిట మరో అమ్మ గా నిలిచిన ‘అమ్మా సేవా సదన్’ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు కూరపాటి అనసూయ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం అశ్వారావుపేట లో నిర్వహించారు.
దీంతో సేవాసదన్ లో వృద్దుల రోదనలు మిన్నంటాయి.విషయం తెలు బీ ఆర్ఎస్ మహిళా నాయకురాలు కాసాని నాగశేషపద్మ అనసూయ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
సేవా పథంలో అలుపెరగని ప్రస్థానం
అంగన్వాడీ లో ఉద్యోగి గా పదవీ విరమణ అనంతరం అనసూయమ్మ తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారు. దిక్కులేని వృద్ధులను అక్కున చేర్చుకుని,వారికి కావాల్సిన వసతి,భోజనం,వైద్య సదుపాయాలను కల్పిస్తూ ఎందరికో అండగా నిలిచారు. ఆమె మృతితో అమ్మా సేవా సదన్ ఆశ్రమవాసులు తమ కన్నతల్లిని కోల్పోయామని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె సేవలను గుర్తించిన పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు ఆమె మరణం సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
అనసూయమ్మ మరణవార్త తెలియగానే కాసాని నాగ శేష పద్మ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “అనసూయమ్మ కేవలం ఒక ఆశ్రమ నిర్వాహకురాలే కాదు, వందలాది మందికి తల్లి ప్రేమను పంచిన గొప్ప మాతృమూర్తి. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి” అని అన్నారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



