కారాకాస్లో ఆందోళనకారుల ప్రదర్శనలు
తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్స్కు తొలిసారి భారీ వ్యతిరేకత
పెద్ద ఎత్తున నిరసనలు
కారాకాస్ : వెనిజులా రాజధాని కారాకాస్ నిరసనలతో హౌరెత్తింది. అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తీసుకొచ్చిన ఆమ్నెస్టీ బిల్లు ఇందుకు కారణమైంది. దీంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజకీయ ఖైదీలకు క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ఇవ్వాలని ఉద్దేశించిన బిల్లును జాతీయ అసెంబ్లీ పరిశీలిస్తున్న వేళ ఈ నిరసనలు జరిగాయి. ఇటు ప్రభుత్వం కూడా ఈ నిరసనలకు కౌంటర్గా ఆందోళనలు నిర్వహింపజేసింది. దీంతో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలు చేసిన నిరసనలతో కారాకాస్ దద్ధరిల్లింది.
గతనెలలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేసిన తర్వాత దేశాన్ని డెల్సీ రోడ్రిగ్స్ తాత్కాలిక అధ్యక్షురాలిగా నడిపిస్తున్న విషయం విదితమే. అయితే ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది తొలి భారీ నిరసన కావడం గమనార్హం. ఆమె పదవిలోకి వచ్చిన తర్వాత వందలాది మంది రాజకీయ ఖైదీలను విడుదల చేసినట్టు ప్రభుత్వం వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే ఆ సంఖ్య ప్రభుత్వం చెప్తున్నదాని కంటే తక్కువగా ఉంటుందని మానవ హక్కుల సంస్థలు చెప్తున్నాయి. ఇంకా 600 మందికి పైగా ఖైదీలు జైలులో ఉన్నారని ‘ఫోరో పెనాల్’ సంస్థ చెప్తున్నది.
ఆమ్నెస్టీ బిల్లు లక్ష్యం ఏమిటీ?
ఈ బిల్లు 1999 నంచి ఇప్పటి వరకు రాజకీయ హింసకు సంబంధించిన కేసుల్లో అరెస్టయిన వారిని విడుదల చేయడానికి ఉద్దేశించబడింది. దేశద్రోహం, ఉగ్రవాదం, ద్వేషప్రచారం వంటి కేసు లో ఇందులో ఉంటాయి. కానీ హత్య, మాదకద్రవ్య రవాణా, అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు మాత్రం ఈ బిల్లులో ఉండవు. ఈ బిల్లు ఆమోదం చెందితో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురైన పలువురు ప్రతిపక్ష నేతలకు మళ్లీ అవకాశం లభించవచ్చు. అందులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో’ కూడా ఉన్నారు.



