తన అత్యద్బుతమైన సుమధర గానంతో 8 దశాబ్దాలకు పైగా అశేష శ్రోతక లోకాన్ని పరవశించిపోయేలా చేసిన గానకోకిల మూగబోయింది. సంగీత ప్రియుల మనసులపైనే కాదు యావత్ సంగీతం ప్రపంచంలోనేే తనదైన ముద్ర వేసి, ప్రత్యేకత చాటుకున్నారు ఆశాభోంస్లే.
తీరాన్ని అలల తాకినట్లు ఆమె జీవితాన్ని కష్టాలు వెన్నంటినా.. ఆత్మవిశ్వాసంతో వాటిని అలవోకగా దాటి, తన అద్బుతమైన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.
సుదీర్ఘ సంగీత ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించి భవిష్యత్ తరాలకూ మార్గదర్శిగానూ నిలిచారు.
1943లో గాయనిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆశాభోంస్లే నిరంతరాయంగా పాటలు పాడి బాలీవుడ్లో అగ్ర గాయనిగా పేరొందారు. హేమాహేమీల్లాంటి గాయనీ మణులున్నా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని 1000కి పైగా సినిమాల్లో 14 భాషల్లో దాదాపు 12,000కి పైగా పాటలు పాడి, అలరించారు.
సినీ రంగానికి సంబంధించి ఎన్నో అవార్డులతో పాటు అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నీస్ బుక్ రికార్డుల్లో స్థానం సొంతం చేసుకున్న ఆశాభోంస్లే 1933లో మహారాష్ట్రకు చెందిన సాంగ్లీలోని గోర్ అనే చిన్న గ్రామంలో సంగీత కుటుంబంలో జన్మించారు. నాన్న దిననాథ్ మంగేష్కర్ నటుడు, గాయకుడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వారిలో లతామంగేష్కర్ ఆశాభోంస్లే.. అక్కాచెల్లెళ్ళు. ఈ ఇద్దరికీ పుట్టుకతోనే సంగీతంపై మక్కువ ఉంది.
చిన్నప్పట్నుంచి సరదాగా పాటలు పాడుతున్న క్రమంలో పదేళ్ల వయసులోనే అనుకోకుండా మరాఠీ సంగీత దర్శకుడు దత్తా దేవ్జేకర్ మరాఠీ చిత్రం ‘మజా బల్’ చిత్రంలో ‘చలా చలా నవ్ చలా’ అనే పాట పాడే అవకాశం ఇచ్చారు. ఈ పాటకు మంచి ఆదరణ రావడంతో ఆ తర్వాత అడపాదడపా కొన్ని అవకాశాలు వచ్చాయి. కాని ఏదీ పెద్దగా పేరు తేలేకపోయాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత బాలీవుడ్ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది.
1948లో వచ్చిన హన్స్రాజ్ బహల్ చిత్రం ‘చునరియా’లో ‘సావన్ ఆయా’ అనే పాట పాడారు. ఆ తర్వాత ఫస్ట్ హిందీ చిత్రం ‘రాత్ కి రాణి’లో సోలోగా పాడారు. భోంస్లేకు వస్తున్న చిత్రాలన్ని చిన్న బడ్జెట్ సినిమాలు కావడంతో పెద్దగా పాపులర్ కాలేకపోయారు. అప్పటి వరకు ఎఆర్ ఖురేషి, సాజిద్ హుస్సేన్, గులామ్ మహమ్మద్ వంటి సంగీత దర్శకులతో కలిసి పని చేశారు. 1952లో సాజిద్ హుస్సేన్ సంగీత సారథ్యంలో వచ్చిన ‘సంగ్దిల్’ చిత్రంతో బాలీవుడ్లో భోంస్లేకు మంచి గుర్తింపు వచ్చింది. 1954లో ‘బూట్ పాలిష్’ చిత్రంలో మహమ్మద్ రఫీతో కలిసి పాడిన ‘నన్నే మున్నె బచ్చే..’ పాటతో బాలీవుడ్లో ఆశాకు లైఫ్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. భోంస్లే గాత్రానికి ఫిదా అయిన బాలీవుడ్ సంగీత దర్శకులు ఆమె కోసం క్యూ కట్టడం ప్రారంభించారు.
క్లాసికల్, గజల్స్, రొమాంటిక్ ఇలా అన్ని రకాల పాటలను సునాయాసంగా పాడగలగడం ఆశాకు దేవుడిచ్చిన వరం. అంతేకాదు మూసధోరణి గాత్రానికి కూడా గుడ్బై చెబుతూ గాత్రంలో సరికొత్త ప్రయోగాలు చేశారు. పాశ్చాత్య పాటలను సైతం తనదైన శైలిలో పాడి, అలరించారు.
ఓ.పి.నయ్యార్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘సి.ఐ.డి’ చిత్రంతో భోంస్లే వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. వీరి కాంబినేషన్లో ‘హౌరాబ్రిడ్జ్’, ‘ముంతాజ్’, ‘కిస్మత్’, ‘మేరే సనమ్’, ‘జంగ్లీ నహీ దేఖా’, ‘ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా’, ‘కాశ్మీర్ కి కలి’ వంటి హిట్ చిత్రాలొచ్చాయి. వీటిల్లో ‘హౌరా బ్రిడ్జ్’ చిత్రంలోని ‘ఆయిరే మెహెర్బాన్..’, అనే పాట, ‘ముంతాజ్’లో ‘యె హై రేష్మి జుల్ఫియోంకా అంధేరా..’, ‘కిస్మత్’లోని ‘ఆవో హుజూర్ తుమ్కో..’, ‘మేరే సనమ్’ చిత్రంలోని.. ‘జాయే ఆప్ కహా…’, ‘దమ్ మారో దమ్’, ‘చురా లియా హై తుమ్నే జో దిల్ కో’ వంటి తదితర ఎన్నో పాటలు సంచలనం సృష్టించాయి.
ప్రసిద్ధ గాయని గీతాదత్తో పరిచయం భోంస్లే జీవితాన్నే మార్చేసింది. ‘నయాదౌర్’ సినిమా భోంస్లేకు కమర్షియల్గా సక్సెస్నిచ్చింది. ఇందులో పాటలన్ని హిట్ కావడంతో భోంస్లే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ‘గుమ్రాహ్’, ‘వక్త్’, ‘హమ్రాజ్’, ‘ఆద్మీ ఔర్ ఇన్సాన్’, ‘ధుండ్’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలుగా నిలువడంతోపాటు ఆమె పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగించాయి. అలాగే రాహుల్ దేవ్ బర్మన్, ఖయ్యూం, రవి, సచిన్ దేవ్ బర్మన్, ఇళయరాజా, ఏ.ఆర్.రెహ్మాన్, జైదేవ్, శంకర్-జై కిషన్, అనుమాలిక్ వంటి అగ్ర సంగీత దర్శకులతో ఎన్నో హిట్ చిత్రాల్లో పాటలు పాడి అగ్ర గాయనిగా తన స్థానాన్ని పదిల పర్చుకున్నారు.
యుక్తవయసులోనే ప్రేమ వివాహం, గర్భిణిగా ఉన్న సమ యంలో భర్త గణపతిరావ్ భోంస్లే దూరం కావడంతో.. ఒక దశలో ఆత్మహత్యకు యత్నించినా, మృత్యువుని తప్పించు కున్నారు.1980లో సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్ను ద్వితీయ వివాహం చేసుకున్నారు.
కెరీర్ పరంగా అత్యున్నత స్థానంలో కొనసాగుతున్నా, జీవితంలో మాత్రం ఆమె ఎన్నో కష్టాల్ని చవిచూశారు. అయినప్పటికీ వేటికి భయపడకుండా ధైర్యంగా ఆ కష్టాలను దాటుతూ అప్రహా తితంగా గాయనిగా జైత్రయాత్ర చేశారు.
రికార్డ్ స్థాయిలో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసి ‘గ్రామీ’ లాంటి పలు అంతర్జాతీయ మ్యూజిక్ అవార్డులందుకున్నారు.
‘దిల్ చీజ్ క్యా హై’ (ఉమ్రావ్ జాన్), ‘మేరా కుచ్ సనమ్ (ఇజా జత్) పాటలకు గానూ రెండు జాతీయ అవార్డులు, 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అమరావతి యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట్మాతక పద్మవిభూషణ్ని పొందారు.
2011లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించు కున్నారు. 8 దశాబ్దాలకు పైగా అవిశ్రాంతంగా అద్భుతమైన పాటలు పాడిన ఈ గానకోకిల శాశ్వతంగా మూగబోవడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మూగబోయిన గాన కోకిల..
ఆశా భోంస్లే పాటలు మధుర జ్ఞాపకాలంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఆమెతో, ఆమె పాటలకు తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆశాభోంస్లే మరణ వార్త విని దిగ్జ్రాంతికి గురయ్యాను. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆమె జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆమె పాటలు ప్రజల జీవితాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
– ప్రధాని నరేంద్ర మోదీ
ప్రముఖ గాయని, జాతీయ పురస్కార గ్రహీత, పద్మ విభూషణ్ ఆశా భోంస్లే లేరన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భార తీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలు, దశా బ్దాల పాటు పలు భాషల్లో ప్రదర్శించిన అపూర్వ ప్రతిభ చిరస్మర ణీయం. ఆమె మరణం దేశంలోని సాంస్కృతిక, కళారంగాలకు తీరని లోటు. – తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
ఆశాభోంస్లే గాత్రం తరతరాల పాటు అనేక రకాల భావోద్వే గాలను పలికిస్తూ, భారతీయ సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది. ప్రతి పాటకూ గ్రేస్ తీసుకువచ్చిన ఆమెను ఎప్పుడూ ఆరాధిస్తా. భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని ఓ స్వరాన్ని కోల్పోయింది. – చిరంజీవి
ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారని తెలిసి చింతించాను. సుదీర్ఘ కాలం హిందీతోపాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ వంటి భాషల్లో సినీ గీతాలు ఆలపించిన మధుర గాయని ఆమె. పాశ్చాత్య సంగీత శైలి గీతాలను సైతం ఆలపించి ఒక తరం యువతను ఉర్రూతలూగించారు. ‘దమ్ మారో దమ్, చురా లియా హై తుమ్నే, ఇన్ అంకో కి మస్తీ, రాధా కైసే న జలే…’ లాంటి గీతాలతో సినీ, సంగీతాభిమానులను అలరిం చారు. తెలుగులో ఆశాజీ పాడిన గీతాలు తక్కువే అయినా హిందీ గీతాలతో తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితమే.
– పవన్ కళ్యాణ్
ఆశాభోంస్లే మరణ వార్త విని కన్నీటిపర్యంతమయ్యా. ఆమె మధురమైన స్వరం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణంగా నిలిచి, లక్షలాది హృదయాలను తాకింది. తరతరాలు నిలిచిపోయే జ్ఞాపకాలను వదిలి వెళ్ళారు. ప్రేమ, గౌరవంతో ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. – ఎన్టీఆర్
‘పాలునీళ్ళు’లో ‘ఇది మౌన గీతం’, ‘చిన్ని కృష్ణుడు’లో ‘జీవితం సప్త సాగరం..’, ‘అశ్వమేథం’లో ‘ఓ ప్రేమ..’, ‘శీతాకాలం ప్రేమకు’, ‘ప్రేమకు ప్రేమంటే తెలుసా’లో ‘జల్లంది మది’, ‘పవిత్రబంధం’లో ‘ఇసాలకిడీ’, ‘ఇద్దరు’ చిత్రంలో ‘వెన్నెల..’, ‘చందమామ’లో ‘నాలో ఊహలకు..’ వంటి తదితర తెలుగు చిత్రాల్లో ఆమె పాడిన పాటలు అందర్నీ మెస్మరైజ్ చేశాయి.



