సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎక్సైజ్ శాఖలో అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మద్యం టెండర్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగానూ ఆందోళన వ్యక్తమవుతున్నదని తెలిపారు. మద్యం షాపులు, టెండర్ల విషయాల్లో వేలం పాడటానికి అంతా సిండికేట్ అయ్యారనీ, పాత వాళ్లకే టెండర్లు ఇవ్వాలని అధికారులు, కొత్త వాళ్లకే ఇవ్వాలని ఆ శాఖ మంత్రి పట్టుబట్టినట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు.
అధికారులకు, మంత్రికి మధ్య విభేదాలకు కారణమేంటి? ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్ఎస్ ఎందుకు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. ఆ శాఖలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వంగానీ, సీఎం రేవంత్రెడ్డి గానీ స్పందించకపోవడం సరిగాదని పేర్కొన్నారు. తక్షణమే ఆ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి, వాటిని అరికట్టేందుకు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. మంత్రులతో పాటు, పలుకుబడి కలిగిన నాయకుల ఒత్తిళ్ల వల్లే పదేండ్ల సర్వీస్ ఉండగానే ఆబ్కారీ ముఖ్యకార్యదర్శి రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నట్టు కనిపిస్తున్నదనీ, ఆయన వీఆర్ఎస్కు గల కారణాలను బహిర్గతం చేయాలని కోరారు.