– రాష్ట్రంలో ఫీజులను పెంచకుండా నిర్ణయం తీసుకోవాలి
– తనిఖీల నివేదికను ఉన్నత విద్యామండలి బహిర్గతం చేయాలి
– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజీల అక్రమాలపై విచారణ జరిపించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇంజినీరింగ్ ఫీజులను పెంచకుండా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టిన నివేదికను ఉన్నత విద్యామండలి బహిర్గతం చేయాలని తెలిపింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజినీకాంత్, కార్యదర్శి టి నాగరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాలేజీల తనిఖీల్లో అనేక లోపాలు బయటపడ్డాయని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపలకులను నియమించకుండా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయటం కోసం సింథటిక్ వేలి ముద్రలతో నడుపుతున్నాయని పేర్కొన్నారు. అధ్యాపకులు ఎక్కువ మంది ఉన్నారనే పేరుతో ప్రభుత్వాన్ని, ఉన్నత విద్యామండలిని ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కళాశాలలుంటే, కేవలం పదుల సంఖ్యలో ఉన్న కళాశాలలు మాత్రమే టీఏఎఫ్ఆర్సీ నిబందనలకు అనుగుణంగా అధ్యాపకులను నియమించాయనీ, సౌకర్యాలు కలిగి ఉన్నాయని వివరించారు. మిగతా కాలేజీల్లో ఎక్కడా ఆ రూపంలో అనుమతుల్లేవని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ను పొందాలనే దురుద్ధేశంతో విద్యార్థులను చేర్పించుకోవటం కోసం కొత్తకొత్త కోర్సుల పేరుతో రూ.లక్షల ఫీజులు పెంచుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా సుమారు రూ.2.40 లక్షల వరకు ఫీజులు పెంచాలని ప్రతిపాదనలు టీఏఎఫ్ఆర్సీకి ఇచ్చాయని తెలిపారు. అధ్యాపకుల జీతాలు, మౌలిక వసతులు కల్పించడం కోసం ఖర్చు పెడుతున్నామని కాలేజీలు చెప్తున్నాయని వివరించారు. సీఎస్ఈ సీట్లను పెంచడానికి ప్రభుత్వం దగ్గర అక్రమ పద్ధతుల్లో అనుమతులు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. అనుమతులు తీసుకుని రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అక్రమ డొనేషన్లు తీసుకుంటున్నాయని వివరించారు. ఇంజినీరింగ్ కాలేజీలలో ఉన్న లోపాల మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నత స్థాయి కమిటీ సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజులు పెంచకుండా తగ్గించే ప్రయత్నం చేయాలని కోరారు. ఇంజినీరింగ్ కాలేజీల అక్రమాలనన్నింటినీ బయట పెట్టి రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ ఇంజినీరింగ్ విద్యను అందించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల అక్రమాలపై విచారణ జరపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES