– రూ.18లక్షల విలువ గల గంజాయి మొక్కలు స్వాధీనం
– నలుగురిపై కేసు నమోదు, అరెస్ట్
– నిందితులకు ప్రభుత్వ పథకాలు రాకుండా చర్యలు : ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ-ఇచ్చోడ
ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం ఇచ్చోడ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండలంలో పట్టుకున్న గంజాయి మొక్కల వివరాలను ఎస్పీ వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. సల్యాద గ్రామంలో అక్రమంగా పంట పొలాల మధ్యలో గంజాయి మొక్కలు పెంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. నలుగురి పంట పొలాల్లో 180 గంజాయి మొక్కలు లభించాయి. వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.18లక్షల వరకు ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన నలుగురిపై కేసు నమోదు చేశారు. చహకటి సోనేరావు చేనులో 17మొక్కలు, దుర్వా లవకుష్ 86, అర్క జంగుబాపు 31, దుర్వా అరుణ్ చేనులో 46 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క గంజాయి మొక్క బహిరంగ మార్కెట్లో రూ.10వేల వరకు ఉంటుంది. నలుగురిపై సెక్షన్8(బి)ఆర్/డబ్ల్యూ20(ఎ)(ఐ)ఎన్డిపిఎస్ చట్టం-1985తో నాలుగు కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలూ కష్టపడుతోందని ఎస్పీ అన్నారు. గంజాయి సాగు, సరఫరాపై ప్రత్యేక బృందాలను ఏర్పాట చేశామని ఎస్పీ వివరించారు. ఎలాంటి సమాచారాన్నైనా మెసేజ్ యువర్ ఎస్పీ నంబర్ 8712659973కు సమాచారాన్ని అందించొచ్చని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. విలేకరుల సమావేశంలో ఉట్నూర్ ఎఎస్పీ కాజల్ సింగ్, సీఐ భీమేష్, ఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు.
గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం
- Advertisement -
RELATED ARTICLES