ఖమ్మం క్రూడాయిల్ను నెర్మెట్టకు తరలించొద్దు
ఇక్కడి క్రూడాయిల్ను ఇక్కడే ప్రాసెస్ చేస్తే అధిక లాభాలు
ఆయిల్పామ్ గ్రోయర్స్ సొసైటీ ధర్నా
నవతెలంగాణ-అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో నూనె శుద్ధి కర్మాగారం, అశ్వారావుపేటలో మరో నూతన పరిశ్రమను తక్షణమే నిర్మించాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ డిమాండ్ చేసింది. ఆదివారం నారంవారిగూడెం సమీపంలోని ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో సొసైటీ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఈ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మహేశ్వరరెడ్డి, పుల్లయ్య, శ్రీరాములు మాట్లాడారు. అనంతరం డివిజనల్ అధికారి, నర్సరీ ఇన్చార్జి అశోక్కు వినతిపత్రాన్ని సమర్పించారు.
సిద్దిపేట జిల్లా నెర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించటం శుభపరిణామం.. కానీ, ఆయిల్ పామ్ రిఫైనరీని అశ్వారావుపేట లేక అప్పారావుపేట ఫ్యాక్టరీలలో ఏదో ఒక చోట ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో రిపైనరీ కడితే ఇక్కడి క్రూడ్ ఆయిల్ను ఇక్కడే ప్రాసెస్ చేస్తే ఆయిల్ ఫెడ్కు మంచి లాభాలు వస్తాయని అన్నారు. ఇక్కడ రిఫైనరీ పెట్టకుండా ఇక్కడి క్రూడ్ ఆయిల్ను నెర్మెట్టకు తరలించడానికి తాము వ్యతిరేకరిస్తున్నామన్నారు. ఇక్కడ నుంచి లక్ష టన్నులు సిద్దిపేటకు తరలించాలంటే ఏడాదికి 4 వేల ట్యాంకర్లు, కనీసం ఒక్కో ట్యాంకర్కు రూ.35 వేల నుంచి 40 వేలు అంటే.. సంవత్సరానికి రూ.16 కోట్లు కేవలం రవాణాకే చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
దానికి బదులు రూ.40 కోట్లతో ఇక్కడే రిపైనరీ కట్టటం మంచిదన్నారు. ఈ ప్రాంతంలో వస్తున్న ఆయిల్ పామ్ తోటల విస్తరణను దృష్టిలో పెట్టుకొని ఒకేసారి 60 టీపీహెచ్తో కొత్త ఫ్యాక్టరీ నిర్మించాలని కోరారు. పెద్దగా ఆయిల్ పామ్ విస్తరణ లేని చోట రూ.300 కోట్లతో ఫ్యాక్టరీ కట్టి, రూ.40 కోట్లతో రిఫైనరీ కట్టటానికి సిద్దపడిన ఆయిల్ ఫెడ్కు.. గత ఏడాదిలో రూ.180 కోట్లు లాభాలు ఇచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.40 కోట్లతో రిఫైనరీ, రూ.60 కోట్లతో అశ్వారావుపేటలో కొత్త ఫ్యాక్టరీ కట్టటం పెద్ద కష్టం కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కారం శ్రీరాములు, తలశిల ప్రసాద్, చెలికాని సూరిబాబు, వెంకట్, మోరంపుడి శ్రీనివాస్ రావు, బి.చిరంజీవి, సోడెం ప్రసాద్ పాల్గొన్నారు.



