బీఎల్ఓలకు శిక్షణ ప్రారంభించిన ఈసీ
కొల్కతా : ప్రతిపక్షాల విమర్శలను బేఖాతరు చేస్తూ బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను కొనసాగిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆ ప్రక్రియను చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా శనివారం పోలింగ్ కేంద్రాల అధికారులకు (బీఎల్ఓలు) శిక్షణ మొదలు పెట్టింది. శిక్షణ కార్యక్రమానికి హాజరైన బెంగాల్ సీఈఓ మనోజ్ అగర్వాల్…రాష్ట్రంలో కూడా సిర్ను చేపట్టే అవకాశాలను తోసిపుచ్చకపోవడం గమనార్హం. ‘భవిష్యత్తులో ఆ పని జరగవచ్చు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రస్తుతం కోర్టు ముందున్న అంశం. తీర్పు రానివ్వండి’ అని ఆయన చెప్పారు. బీఎల్ఓలను ప్రతిసారీ పిలవలేమని, అందుకే ఇప్పుడు సిర్పై కూడా వారికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. సిర్ సహా ఏ కసరత్తుకైనా సిద్ధంగానే ఉన్నామని అగర్వాల్ అన్నారు. కాగా బెంగాల్లో సిర్ను అనుమతించబోమని అధికార తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో బీజేపీకి సాయపడేందుకే ఈసి కృషి చేస్తోందని, అయితే బెంగాల్లో ఆ పని అంత తేలిక కాదని తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి జయప్రకాష్ మజుందార్ చెప్పారు. ఎన్నికల కమిషన్ కుట్రలు బెంగాల్లో సాగబోవని ఆయన తెలిపారు.
ఇక బెంగాల్లోనూ సర్!
- Advertisement -
- Advertisement -