Wednesday, October 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్వాడీ నియామకాల ప్రక్రియ వేగవంతం

అంగన్వాడీ నియామకాల ప్రక్రియ వేగవంతం

- Advertisement -

సుప్రీం కోర్టు స్టే తొలగేలా చర్యలు ప్రారంభించండి : అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క
లా సెక్రెటరీ, పీఆర్సీ చైర్మెన్‌తో మంత్రి సమావేశం


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నియామకాలకు ఆటంకంగా ఉన్న సుప్రీం కోర్టు స్టేను వెకేట్‌ చేయించేందుకు తగిన చర్యలు వెంటనే చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో లా సెక్రటరీ బీ. పాపిరెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌, పీఆర్సీ చైర్మెన్‌ ఎన్‌. శివశంకర్‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, డైరెక్టర్‌ శృతి ఓజాతో మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల నియామకాల్లో ఎదురవుతున్న న్యాయ చిక్కులపై చర్చించారు. న్యాయ చిక్కులను అధిగమించే దిశలో వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. రాష్ట్రంలో సుమారు 14 వేల వరకు అంగన్వాడీ ఖాళీలుండగా వాటి భర్తీపై గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే.

ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్‌, హెల్పర్‌ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్‌ చేసిన ప్రభుత్వం, చిన్నారులు తమ మాతృభాషలో నేర్చుకోవడం సులువవుతుందన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రిజర్వేషన్లు 50 శాతం మించిపోవడంతో, కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో స్టేను వెకేట్‌ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలనీ, ఆ దిశగా లా సెక్రటరీ పాపిరెడ్డికి మంత్రి సీతక్క సూచించారు. రిక్రూట్‌మెంట్‌, సర్వీస్‌ రూల్స్‌లో నిపుణుడైన ఎన్‌. శివశంకర్‌ సలహాలతో ముందుకు వెళ్లాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు పర్యటించి అంగన్వాడీ రిక్రూట్‌మెంట్‌ విధానాన్ని అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు.

ఆ రాష్ట్రాల్లో అంగన్వాడీ పోస్టులు ప్రభుత్వ సర్వీస్‌ కిందకు రాకపోవడం వలన సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ వర్తించవనీ, దీంతో రిజర్వేషన్లు 50 శాతం పరిమితి వర్తించదని అధికారులు వివరించారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడీ పోస్టులు ఎస్టీలకే రిజర్వ్‌ చేసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి అనుగుణంగా తెలంగాణలోనూ అదే విధానాన్ని అవలంబించి సుప్రీం కోర్టు స్టేను వెకేట్‌ చేయించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పది రోజుల్లో నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేయాలన్నారు. అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేసే దిశలో కొత్త నియమాకాలు దోహదపడుతాయని ఆకాంక్షించారు. అందుకే అంగన్వాడీల నియమాకాలను సత్వరం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -