నవతెలంగాణ-హైదరాబాద్ : ‘జన నాయగన్’ ట్రైలర్లో నాలుగు సన్నివేశాలు చూసి ‘భగవంత్ కేసరి’ని యథాతథంగా తీసేశారని అనడం సబబు కాదని దర్శకుడు అనిల్ రావిపూడి అభిప్రాయపడ్డారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘మన శంకరవరప్రసాద్గారు’ చిత్ర ప్రమోషన్స్లో అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘భగవంత్ కేసరి’ రీమేక్పై ప్రశ్నించగా, అనిల్ చాలా హుందాగా స్పందించారు. సినిమా వచ్చే వరకూ సోషల్మీడియాలో చర్చ అనవసరమని అన్నారు.
‘‘భగవంత్ కేసరి’ మూవీ ఆత్మను తీసుకుని అక్కడి నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసుకుని ఉంటారు. బహుశా ఓపెనింగ్ సీన్స్, ఇంటర్వెల్ ఇలా కొన్ని పార్ట్లు యథాతథంగా తీసి ఉండవచ్చు. మిగిలినదంతా మార్చి ఉంటారు. విలన్ ట్రాక్ మొత్తం మారిపోయినట్లు కనిపిస్తోంది. రోబోట్స్ కూడా ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ జోడించినట్లు తెలుస్తోంది. ‘భగవంత్ కేసరి’ కంటెంట్ విజయ్ గారికి బాగా నచ్చింది. ఎవరేమనుకున్నా.. ఎవరెంత అనుకున్నా సినిమాలో సోల్ బాగుంటుంది. దానికి విజయ్ నటన మరింత బలమవుతుంది. రీమేక్ అనుకున్నప్పుడు ఎవరు తీసినా, అలాగే తీయాలి. గతంలో రీమేక్స్ అన్నీ అలా తీసినవే కాదా? కరోనా తర్వాత రీమేక్స్ తగ్గాయి’’
‘‘అసలు రీమేక్ అంటే ఏంటి?ఒక భాషలో తీసిన సినిమాను మరో భాషలో తీయడమే కదా! వాళ్లు రీమేక్ అని చెప్పకపోవడానికి కారణం దాని చుట్టూ మరిన్ని విమర్శలు ఎదురవుతాయని భావించి ఉండవచ్చు. తమిళ ప్రేక్షకులకు ఇది కొత్త సబ్జెక్ట్. అక్కడి వాళ్లందరూ వచ్చి ‘భగవంత్ కేసరి’ చూడలేదు కదా! హిందీలో ‘దబాంగ్’ను తెలుగులో ‘గబ్బర్ సింగ్’గా మార్చి బాగా తీశారు. మంచి హిట్ కూడా అయింది. ఒక కథకు అక్కడి హీరో బలాలు యాడ్ అయితే, సినిమా మరోలా ఉంటుంది. ఇంకా మనం సినిమాను చూడలేదు. ఆయన ఏం చేశారో చూశాకే మాట్లాడాలి. ట్రైలర్లో కొన్ని సీన్స్ చూసి, చర్చ చేయడం అనవసరం. కంటెంట్ బయటకు వస్తేనే మాట్లాడాలి. ఇది విజయ్గారికి మంచి వీడ్కోలు అవ్వాలని కోరుకుంటున్నా’’ అని అనిల్ రావిపూడి అభిప్రాయపడ్డారు.



