న్యూఢిల్లీ : భారత పతాకంతో ఉన్న ‘గ్రీన్ ఆశా’ అనే ఎల్పీజీ నౌక ఆదివారం హార్ముజ్ జలసంధిని దాటింది. దీంతో ఇప్పటి వరకూ హార్ముజ్ను సురక్షితంగా దాటిన భారత నౌకల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇది ప్రస్తుతం భారత్ వైపు వస్తోందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. గత రెండు రోజుల వ్యవధిలోనే రెండు ఎల్పీజీ నౌకలు జలసంధిని దాటాయి. వీటలో 94 వేల టన్నుల ఎల్పీజీ ఉంది. అమెరికా-ఇజ్రాయిల్ సేనలు దాడులు మొదలు పెట్టిన తర్వాత జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత నౌకలు క్షేమంగా జలసంధిని దాటే విషయమై కేంద్ర ప్రభుత్వం ఇరాన్ అధికారులతో చర్చలు జరిపింది. శత్రు దేశాల నౌకలకు మాత్రమే అనుమతులు ఉండవని ఇరాన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాజాగా కీలకమైన బాబల్ ఎల్ మాండేబ్ జలసంధిని కూడా మూసేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.



