నవతెలంగాణ-హైదరాబాద్ : ఈగల్, హైడ్రా తరహాలో మరో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మాదక ద్రవ్యాలను నిరోధించడానికి ‘ఈగల్’, హైదరాబాద్ నహానగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల రక్షణ కోసం ‘హైడ్రా’ అనే వ్యవస్థలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఆహార కల్తీ నియంత్రణ కోసం సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, హైడ్రా, ఈగల్ తరహాలో సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామని అన్నారు. దేశంలో చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామని తెలిపారు.
రైతుల హక్కులను కాపాడేందుకు తాము కనీస మద్దతు ధర చట్టం తీసుకువచ్చామని గుర్తు చేశారు. పంటకు ధర నిర్ణయించే అవకాశం రైతుకు లేకుండా పోయిందని వాపోయారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.



