నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్లోని జైపుర్లో ఘోర ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ జైపుర్లోని లోహమండి రోడ్డుపై ఐదు కిలోమీటర్ల మేర బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టడంతో 10మంది మృతి చెందగా..50మందికిపైగా గాయాలపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయిన ట్రక్కు డ్రైవర్ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర అనేక వాహనాలను ఢీకొంటూ వెళ్లినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు, పోలీసుల బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి.
రోడ్డుపై వాహనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా నిన్న రాత్రి రాజస్తాన్లోని ఫలోడి సమీపంలో టెంపో ట్రావేలర్ వేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు.



