వేగంగా అమరావతి అభివృధ్ధి : ప్రధాని మోడీ
కర్నూలు: ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రధాని మోడీ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
”సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీలో అనంత అవకాశా లతో పాటు యువతకు అపార శక్తి ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది. 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోంది. దిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. 2047 నాటికి మన దేశం.. వికసిత్ భారత్గా మారుతుంది. 21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం” అని ప్రధాని మోడీ అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం
”ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది. ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం. ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులతో దేశం ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా సబ్ సీ గేట్వేగా ఏపీ మారుతుంది. ఈ ప్రాజెక్టు విశాఖను ఏఐ, కనెక్టివిటీ హబ్గా మారుస్తుంది. దీని ద్వారా భారత్తో పాటు యావత్ ప్రపంచానికి సేవలు అందుతాయి. భారత్ అభివృద్ధికి ఏపీ అభివృద్ధి చాలా అవసరం.
అలాగే ఏపీ అభివృద్ధికి.. రాయలసీమ అభివృద్ధి అంతే అవసరం. ఈ ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి. రాయలసీమ ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరిపిస్తాయి. ప్రాజెక్టులతో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. భారత్ను 21వ శతాబ్దపు తయారీ కేంద్రంగా ప్రపంచం చూస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ సాధన కు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీ సామర్థ్యాన్ని విస్మరించాయి. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉంది. ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతోంది” అని ప్రధాని అన్నారు.