– సిపిఐ – ఏఐటీయూసీ నాయకులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని అందరి ముందు అవమానపరిచిన ఘటనపై మున్సిపల్ చైర్మన్ భర్త ఇప్ప శ్రీనివాస్ బహిరంగ క్షమాపణ చెప్పాలని సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు ఆదివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో ఒక మహిళా ఉద్యోగిని కంటతడి పెట్టించేలా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు.
ప్రజా ప్రతినిధి కుటుంబ సభ్యుడిగా ఎలాంటి అధికార హోదా లేకుండానే ఉద్యోగులపై ఆధిపత్యం చలాయించడం, రాత్రి 7.30 నుండి 8 గంటల వరకు పనిచేయాలని ఒత్తిడి చేయడం, అందరి ముందు అవమానించడం తగదని పేర్కొన్నారు. మహిళా కౌన్సిలర్లు పదవుల్లో ఉన్నప్పటికీ వారి భర్తలు అధికార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. కౌన్సిలర్ల భర్తలకు మున్సిపల్ వ్యవహారాల్లో ఎలాంటి అధికార హక్కులు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికైనా శ్రీనివాస్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
మున్సిపల్ కార్మికులకు బకాయిగా ఉన్న జనవరి, ఫిబ్రవరి నెలల వేతనాలను తక్షణమే చెల్లించాలని, వార్డుల పెంపు చేయాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కి, రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ కి లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి. బాలరాజ్, జిల్లా అధ్యక్షుడు గొర్రె బాలరాజ్, శ్రీనివాస్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.



