సెర్ప్ ఉద్యోగులమాదిరిగానే మమ్ముల్నీ చూడండి
మంత్రి సీతక్కకు ఉపాధిహామీ ఉద్యోగుల వినతి
సానూలంగా స్పందింస్తూ ఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించిన మంత్రి
ధన్యవాదాలు తెలిపిన ఉపాధి ఉద్యోగుల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టంలో భాగంగా 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్న తమకు పేస్కేలు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపాధి హామీ చట్టం ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి సీతక్కకు జేఏసీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె వద్ద పలు అంశాలను ప్రస్తావించారు. ఏటా కేవలం రూ. 30 కోట్లు అదనంగా వెచ్చిస్తే పేస్కేలు అమలు చేయొచ్చనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పేస్కేల్కు సంబంధించిన ఫైల్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పేస్కేల్పై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చిరు ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. పలు సాంకేతిక సమస్యలను కారణంగా చూపుతూ పే అండ్ అకౌంట్స్ సెక్షన్ తమ జీతాల చెల్లింపుల్లో జాప్యం చేస్తుందని జేఏసీ నేతలు మంత్రికి మోర పెట్టుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే అండ్ అకౌంట్స్ సెక్షన్ అధికారులతో మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలతో చిరు ఉద్యోగుల జీతాలు ఆపొద్దనీ, మానవతా దృక్పథంతో వ్యవహరించి జీతాలు చెల్లించాలని ఆదేశించారు. తమ పేస్కేలు డిమాండ్కు సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్కకు నరేగా-ఎఫ్టీఈఎస్ జేఏసీ చైర్మెన్ లింగయ్య, ఇతర ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
పే స్కేలు వర్తింపజేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES