రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు : డాక్టర్ డి.రవీంద్ర నాయక్
నవతెలంగాణ-సుబేదారి
వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటూ వైద్యాధికారులు సిబ్బంది వారం రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి.రవీంద్ర నాయక్ ఆదేశించారు. ఆదివారం ఆయన హనుమకొండ, వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ ఏ. అప్పయ్య, డాక్టర్ బి.సాంబశివరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ మాలికను మూడు రోజులుగా వారి పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే వివరాలు, నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు, క్యాంపులకు చికిత్స నిమిత్తం ఎలాంటి సమస్యలతో వస్తున్నారనే తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ముఖ్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజారెడ్డి తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నీరు నిలువ ఉండటం, నీరు-ఆహార పదార్థాలు కలుషితం కావడం, పరిశుభ్రత తదితర సమస్యల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తూ ఉండాలన్నారు. ప్రోగ్రాం అధికారులు క్షేత్రస్థాయిలో గృహ సర్వే, వైద్య శిబిరాల నిర్వహణ, పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడంలో వైద్యాధికారులు, సిబ్బందితో సమన్వయంగా పని చేయించాలన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ ఏ అప్పయ్య, వరంగల్ డీఎంహెచ్వో డాక్టర్ బి సాంబశివరావు అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ టి. మదన్మోహన్రావు, టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఇక్తదార్ అహ్మద్, డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, వరంగల్ డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కొమురయ్య, డాక్టర్ మోహన్ సింగ్, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ ఉదయరాజ్, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.



