Wednesday, June 4, 2025
E-PAPER
Homeజాతీయంపోలవరం-బనకచర్లపై కేంద్రానికి ఏపీ ప్రతిపాదన

పోలవరం-బనకచర్లపై కేంద్రానికి ఏపీ ప్రతిపాదన

- Advertisement -

రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టు
ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో ప్రజంటేషన్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచింది. సోమవారం ఢిల్లీలో బనకచర్ల ప్రాజెక్టుపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ సేత్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పియూష్‌ కుమార్‌, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై అధికారులు కేంద్ర ఆర్థిక శాఖకు పూర్తి వివరాలను అందించారు. రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో రైతులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై ప్రజంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. గత నెల జరిగిన భేటీల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు. సీఎం ప్రతిపాదనపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. దీంతో ప్రాజెక్టు సమగ్ర వివరాలను అధికారులు కేంద్ర ఆర్థిక శాఖకు వివరించారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు వచ్చే లాభ నష్టాలపై ఏపీ ప్రభుత్వం వివరాలను అందించింది. భవిష్యత్తులో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని అధికారులు వివరించారు. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరా లపై కూడా ప్రజంటేషన్‌లో సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. సముద్రంలోకి వృధాగా పోతున్న సుమారు రెండు వేల టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ ఉన్న తెలంగాణకు కూడా ఉపయోగమే తప్ప, ఆ రాష్ట్ర నీటిని తామేమీ తీసుకోవడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -