సుప్రీంకోర్టు సూటి ప్రశ్న
ప్రజల కోసమే విద్యుత్ అని స్పష్టీకరణ
నాణ్యమైన సరఫరా, అందుబాటులో ధరలు
ఇవే ఈఆర్సీల విధులు
డిస్కంల రెగ్యులేటరీ ఆస్తిని మూడేండ్లలోపు రద్దు చేయాలి
న్యూఢిల్లీ : విద్యుత్ నియంత్రణ కమిషన్లు (ఈఆర్సీలు) స్వతంత్రంగా పనిచేస్తున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెగ్యులేటరీ ఆస్తుల నిర్వహణ, ఖర్చు రికవరీలో జాప్యానికి వ్యతిరేకంగా ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (డీఈఆర్సీ), విద్యుత్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఏపీటీఈఎల్)ను సవాల్ చేస్తూ బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెట్, ఇతర భాగస్వామ్యులు వేసిన పిటిషన్ విచారణలో భాగంగా జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ ప్రశ్న వేసింది. ప్రజల కోసమే విద్యుత్ అని స్పష్టం చేసింది. సమాజంలో అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, అందుబాటులో ధరలు లభించేలా చూడ్డమే విద్యుత్ నియంత్రణ కమిషన్ల (ఈఆర్సీలు) విధులని కొన్ని రోజుల క్రితం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. ఇందులో భాగంగా ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని తెలిపింది. 2003 విద్యుత్ చట్టం ప్రకారం ప్రజాప్రయోజనాల కోసం విద్యుత్ను విక్రయించడం, పంపిణీ చేయడం, మార్కెట్ శక్తుల ప్రభావం లేకుండా చూసుకోవడానికి విద్యుత్ నియంత్రణ కమిషన్లు (ఈఆర్సీలు)ను ఒక రక్షణ కోటగా పనిచేయడానికి ఉద్దేశించారని సుప్రీంకోర్టు వెల్లడించింది. కానీ.. ఈఆర్సీలు ఈ విధంగా పని చేస్తున్నాయా.. అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే, చట్ట ప్రకారం తమకు కల్పించబడిన స్వతంత్రత, స్వయం ప్రతిపత్తికి అనుగుణంగా ఈఆర్సీలు పనిచేయడంపై సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. విద్యుత్ టారిఫ్లను నిర్ణయించడంలో ఈఆర్సీలు ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంటాయని గుర్తు చేసింది. చట్ట ప్రకారం ఇఆర్సిలు నిర్ణయించిన విద్యుత్ టారిఫ్లు సరఫరా ఖర్చును ప్రతిబింబించాలని, క్రాస్ సబ్సీడీలను తగ్గించాలని తెలిపింది. కానీ.. విద్యుత్ పంపిణీ కంపెనీల రెగ్యులేటరీ ఆస్తిని చట్టం అంగీకరించిన పరిమితికి మించి అనుమతించడం ద్వారా, విద్యుత్ టారిఫ్లను భారీగా పెంచడానికి ఈఆర్సీలు ఒక ‘నిర్వహణ, యుక్తి’ వ్యూహాలను అనుసరిస్తున్నాయని సుప్రీంకోర్టు విమర్శించింది. విద్యుత్ టారిఫ్లు నిర్ణయించడానికి కీలకమైన విద్యుత్ పంపిణీ సంస్థల రెగ్యులేటరీ ఆస్తిని కొన్ని దశాబ్దాలుగా లిక్విడేట్ చేయడానికి, రద్దు చేయడానికి ఈఆర్సీలు ఉద్దేశ పూర్వకంగానే అనుమతించడం లేదని, కాబట్టి ఈ రెగ్యులేటరీ ఆస్తి అనేది గాలి బుడగలాగా మారిందని, దీంతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లితోందని,, విద్యుత్ కోసం ఎక్కువ ధరల భారాన్నీ వారు భరించాల్సి వస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక నుంచి భవిష్యత్లో విద్యుత్ పంపిణీ సంస్థల రెగ్యులేటరీ ఆస్తిని మూడేళ్లలోపు రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ ఆస్తులను గరిష్టంగా ఏడేండ్లలోపు లిక్విడేట్ చేయాలని స్పష్టం చేసింది.
ఈఆర్సీలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES