అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాజీ సీఎం మాట్లాడాలని డిమాండ్
కేసీఆర్ ఫాంహౌస్ ఎదుట కాంగ్రెస్ నిరసన
నవతెలంగాణ-మర్కుక్
కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంపై మాట్లాడాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని కాంగ్రెస్ నాయకులు ఆదివారం ముట్టడించి నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంక్షారెడ్డి, కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి,
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద నిరసనకు దిగారు. ‘గజ్వేల్ ప్రజలవి ఓట్లు కావా..? అసెంబ్లీకీ మాత్రం రావా..’ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ అసెంబ్లీకి ఒక్కరోజు మాత్రమే హాజరై, నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించకుండా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోవడాన్ని నిరసిస్తూ ఈ ధర్నా చేపట్టినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. వ్యవసాయ క్షేత్రాన్ని వీడి గజ్వేల్ ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.



