Wednesday, February 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏపీ జలదోపిడీ చేస్తుంటే నిద్రపోతున్నారా?

ఏపీ జలదోపిడీ చేస్తుంటే నిద్రపోతున్నారా?

- Advertisement -

సీఎం, నీటిపారుదల శాఖమంత్రిపై హరీశ్‌రావు ఆగ్రహం
తెలంగాణకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ
కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిద్ర పోతున్నారా? అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మంగళ వారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండ్లెంట్లు లేవు, బోర్డు అనుమతులు లేవు ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను ఇష్టారాజ్యంగా తీసుకు పోతున్న దని అన్నారు. జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌లో కూర్చొని సీఎం చోద్యం చూస్తున్నారని చెప్పారు. 66:34 నిష్పత్తి ప్రకారం ఏపీ ఇప్పటికే 664 టీఎంసీలు అంటే 80శాతం నీటిని ఏపీ వాడుకున్నదని వివరించారు. కేఆర్‌ఎంబీ సమావేశం నిర్వహించి ఏపీ నీటి దోపిడీని ఆపాలంటూ ఈఎన్సీ గతనెల 28న లేఖ రాశారని గుర్తుచేశారు. 31న ఆ ఈఎన్సీ ఉద్యోగ విరమణ పొందారని చెప్పారు. వారంరోజుల వరకు ఆ పోస్టును ఎందుకు నింపలేదని ప్రశ్నిం చారు. రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రభుత్వానికి పట్టవా?అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబు ఉన్నారనే భయంతోనే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నుంచి నీళ్లు తరలించుకుపోతున్నా ఏమీ మాట్లాడ్డం లేన్నారు. వేసవిలో నీటి అవసరాలుంటాయనీ, పంటలు, పారిశ్రామిక అవసరా లకు నీళ్లు అవసరమన్నారు. తెలంగాణ 34 శాతం నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నా 20 శాతం నీటినే వాడిందని చెప్పారు. ఈ రెండేండ్లలో అతి తక్కువ కృష్ణా జలాలను ఈ ప్రభుత్వం వినియోగించిందని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి వైఫ్యల్యానికి ఇది నిదర్శనమనీ, రాష్ట్రం పాలిట శాపంగా తయా రైండని విమర్శించారు. కేంద్రం చేతిలో కేఆర్‌ఎంబీ ఉందన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు ఉన్నా తెలంగా ణకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడ్డం లేదని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు, రేవంత్‌ మధ్య ఫెవికాల్‌ బంధం ఉండొచ్చని చెప్పారు. కేంద్రం తక్షణమే స్పందించి ఏపీ నీళ్ల తరలింపును అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. త్వరలో కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామనీ, కేంద్ర మంత్రిని కలుస్తామనీ, పార్లమెంట్‌లో గట్టిగా లేవనెత్తుతామని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు 16 మంది ఎంపీలున్నా తెలంగాణ హక్కులను కాపాడటంలో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -