Thursday, June 19, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసాయుధ పోరాట యోధ.. కామ్రేడ్‌ సుగుణ

సాయుధ పోరాట యోధ.. కామ్రేడ్‌ సుగుణ

- Advertisement -

ప్రపంచ విప్లవాల చరిత్రలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా నిది ప్రత్యేకస్థానం.’బాంఛన్‌ దొరా..నీ కాల్మొక్తా ‘ అన్న సామాన్యులే సాయుధులై నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి, భూస్వాముల దోపిడీపై తిరగబడి, వెట్టిచాకిరీ విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసి రాచరిక వ్యవస్థను కుప్పకూల్చిన చరిత్ర ఈ మహత్తర పోరాటానిది. ఈ పోరాటం లో రహస్య కేంద్ర స్థావరానికి బాధ్యతలు నిర్వహించిన విప్లవ కారిణి, స్వాతంత్య్ర సమర యోధురాలు కామ్రేడ్‌ సుగుణ. ఈనెల 16న ఆమె తన తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న తరమంతా దాదాపు ముగిసి నట్టేనని భావించవచ్చు. అత్యంత క్లిష్టమైన గడ్డు పరిస్థితుల్లో పట్టుకుంటే కాల్చివేసే కాలంలో రహస్య స్థావరానికి నాయకత్వం వహించిన కామ్రేడ్‌ సుగుణ నిజంగా ధైర్యశాలి.
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా బీబీనగర్‌ దగ్గర బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సుగుణ తల్లిదండ్రులకు వారు ఐదుగురు సంతానం. వారిది ధనిక రైతు కుటుంబం. అన్నయ్య కోదండ రామిరెడ్డి సాయుధ పోరాట కాలంలోనే పోలీసుల కాల్పుల్లో వీరమరణం పొం దాడు. అక్క శశికళ ఐదేండ్లపాటు, ఆమె భర్త దళంలో పనిచేస్తూ పోలీసులకు చిక్కి ఆరేండ్లపాటు జైళ్లో బంధీగా ఉన్నారు. కామ్రేడ్‌ సుగుణ పోరాట చైతన్యానికి అన్న కోదండరామిరెడ్డినే స్ఫూర్తి. ఆమెకు చిన్నతనంలోనే ఆర్యసమాజ్‌, ఆంధ్రమహాసభ, కమ్యూనిసు పార్టీతో సంబంధం ఏర్పడింది. రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహా రెడ్డి,దేవులపల్లి వెంకటేశ్వరరావు ఉద్యమ అవసరాల రీత్యా తరచూ సుగుణ ఇంటికి వచ్చేవారు. ఈ రకంగా వారితో మాట్లాడి, కలిసి చర్చించే అవకాశం ఆమెకు దొరికేది. అన్నయ్య కోదండరామిరెడ్డి, తన సోదరి శశిరేఖను, భీమిరెడ్డి సోదరి మల్లు స్వరాజ్యంను విజయవాడలో జరిగే రాజకీయ ట్రైనింగ్‌ క్యాంపునకు పార్టీ పంపిగా తను కూడా వెళ్లాలనుకుంది. తుపాకి పట్టుకోవాలనే ఆకాంక్షను ఎప్పుడూ నాయకుల ముందు పెట్టేది. కానీ, వారు ఇంకా సమయం ఉందిలే అనేవారు. తన అక్క శశికళ, మల్లు స్వరాజ్యం ఆయుధాలతో, దళాలతో కనపడుతుంటే సుగుణ రక్తం మరిగి పోయేది. ఎప్పుడు పార్టీలో చేరాలా అనే ఉత్సా హంతో ఉండేది. పార్టీ నాయకులు కలిసినప్పుడల్లా తనకు సభ్యత్వం ఎప్పుడిస్తారు? అని అడిగేవారు. ఇంకా చిన్నదానివేనని, పదహారు సంవత్సరాలు ఉంటేనే సభ్య త్వం ఇస్తామని వారు చెప్పేవారు. కామ్రేడ్‌ సుగుణ పట్టుదల, పార్టీ అవసరాలు, ఏదైతేనేమీ ఆ లోపే స్వయంగా రావి నారాయణరెడ్డి ద్వారా ఆమె పార్టీ సభ్యత్వం పొందారు. పార్టీ కేంద్ర రహస్య స్థావరంగా ఉండే ”డెన్‌” బాధ్యతలు ఆమెకు అప్పజెప్పారు. కామ్రేడ్‌ సుగుణతోపాటు కామ్రేడ్‌ వెంకటాచారి (చారి), అనిరెడ్డి అనంతరెడ్డి (హైకోర్టు అడ్వకేట్‌గా పని చేశారు) కూడా ఉన్నారు. ఈ ముగ్గురితో ”డెన్‌” నిర్వహణకు కమిటీ, దాంతోపాటే పార్టీ కేంద్రం చాలా రహస్యంగా నిర్వహించారు. పరిమితమైన అతి ముఖ్య నాయకులు మాత్రమే జాగ్రత్తగా వచ్చి పోయే వారు. పార్టీ రహస్య కేంద్రం నిర్వహించే ఆ ముగ్గురు పని పార్టీ డాక్యుమెంట్‌ని కాపీలు చేయటం, సర్క్యులర్స్‌ని తయారు చేసి పంపడం, సమాచారాన్ని సేకరించటం, అవసరమైన కామ్రేడ్స్‌కి అందజేయడం ప్రధానమైన విధిగా ఉండేది.
దళంలో పనిచేయాలనే ఆరాటం
కానీ, కామ్రేడ్‌ సుగుణ దృష్టంతా తుపాకీ పోరాటం, దళంలో పనిచేయాలనే ఆరాటం చుట్టే ఉండేది. అందుకే తన అసంతృప్తిని కామ్రేడ్‌ రావి నారాయణరెడ్డి సమక్షాన వెలిబుచ్చేవారు. దీంతో ఆయన ‘మీరు చేసే పని చిన్నదిగా తక్కువగా భావించవద్దు. ఇది చాలా కీలకమైనది. అందరూ చేయలేనిది. ఎంతో నమ్మకం, క్రమశిక్షణ కలిగిన వారు మాత్రమే చేయగలిగింది. వారికి ప్రత్యేకంగా నైపుణ్యం ఉండాలి. వారికి రాయగలిగే శక్తి ,అర్థం చేసుకోగలిగే శక్తి అవసరం. అవన్నీ మీకు ఉన్నాయని భావించే పార్టీ మిమ్మల్ని ఇక్కడ ఉంచింది. ఇది మన విప్లవ కార్యక్రమంలో ఒక ప్రధానమైన భాగంగా మీరు గుర్తించాలి.’ అన్నారట. ‘మేము ఏ దళంలో లేం కదా? అంటే మా పనికి ప్రాధాన్యత లేదా’ సుగణ ప్రశ్నించగా ప్రత్యేకంగా కామ్రేడ్‌ సుందరయ్య, దేవులపల్లి రహస్య డెన్‌ ప్రాధాన్యతని అర్థం చేయించారు. కేంద్రానికి వీరితో పాటు చండ్ర రాజేశ్వరరావు, మగ్దుం మోహినుద్దీన్‌, రాజ్‌ బహదూర్‌ గౌర్‌, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మేజర్‌ జైపాల్‌ సింగ్‌ లాంటి కేంద్ర జాతీయ నాయకులు మాత్రమే వచ్చేవారు. ఆ కేంద్రం ప్రాధాన్యతేమిటో నెమ్మదినెమ్మదిగా సుగుణ అర్థం చేసుకుని దాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.
నిత్యం ప్రజల గురించే ఆలోచన
సాయుధ పోరాటం ప్రారంభమైన తర్వాత ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో పార్టీని పటిష్ట పరచటానికి ఆంధ్ర నుండి ఎస్వీకే ప్రసాద్‌ను తెలంగాణకు పంపింది. ఆయన కూడా అప్పుడప్పుడు ”డెన్‌”కి వచ్చి పోయేవారు. ఆయనతో పరిచయం వారిద్దరి వివాహ జీవితానికి నాంది పలికింది. 1949 నవంబర్‌ 25వ తారీఖున వారి పెండ్లి జరగ్గా దాన్ని నిర్వహించింది రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గార్లే. పెండ్లయిన కొంతకాలానికే ఎస్వీకే ప్రసాద్‌ హైదరాబాదులో పోలీసుల చేతికి చిక్కి దాదాపు నాలుగేండ్ల పాటు జైలు జీవితం గడిపాడు. 1954లో సుప్రీంకోర్టు జోక్యంతో విడుదలయ్యారు. పార్టీలో సుగుణ కీలకపాత్ర వహించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చి ఆమెపై వారంట్‌ ఇచ్చింది.ఆమె కోసం పోలీసులు వెతకటం ప్రారంభించారు. కొంతకాలం రహస్య జీవితం గడిపిన తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. రెండేండ్లపాటు పాటు జైల్లో ఉండి 1952లో విడుదలయ్యారు.
తెలంగాణలోనే ఉండి ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధికి దంపతులిద్దరూ జీవితాంతం కృషి చేస్తూ వచ్చారు. వరంగల్‌ జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కామ్రేడ్‌ ప్రసాద్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాప్రతినిధిగానూ సేవలందించారు.1994లో చని పోయారు.
కామ్రేడ్‌ సుగుణ చివరి వరకు మహిళా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కమ్యూనిస్టు ఉద్యమంలోనే కొనసాగుతూ వచ్చారు. ఆమె చివరిదశలో, ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా ప్రజల పరిస్థితి గురించే చర్చించేవారు. పెచ్చరిల్లుతున్న మూఢనమ్మకాలు, అవినీతి ,మతోన్మాదం తదితర అంశాల పట్ల ఆవేదన వ్యక్తపరిచేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యం కావలసిన అవసరం ఉందని నొక్కి చెప్పే వారు. ఎన్నికల్లో పాల్గొనే కమ్యూనిస్టు పార్టీలైనా, ఒక సంఘటనగా ఏర్పాటు కావాలని ఆకాంక్షించేవారు.’2001 నుండి ఈ అంశాల గురించి నేను చెప్తూనే వస్తున్నాను’ అని తను ఇంగువ మల్లికార్జున శర్మకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలని ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. సుగుణ 91 సంవత్సరాల పాటు జీవించారు. ఆమెవరో ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పటి తరానికి ఆమె గొప్ప తనం, త్యాగం, నేపథ్యమేమిటో, ఆ కుటుంబ ప్రత్యేకత ఏమిటో తెలుసు. కామ్రేడ్‌ సుగుణకు కూతరు, ఇద్దరు కుమారులున్నారు. వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. సుగుణ మనమధ్యలో లేకపోయినా చిన్నతనంనుంచే సమాజం పట్ల అంకితభావం, నిర్భయత్వం, త్యాగశీలత, క్రమ శిక్షణ, జీవితాంతం లక్ష్యం కోసం నిలబడటం, కమ్యూనిస్టుల ఐక్యతకు తపించడం అందరికీ ఆదర్శమే. కామ్రేడ్‌ సుగుణ ఆశయాలను నెరవేర్చ టమే ఆమెకు మనమిచ్చే నిజమైన నివాళి.
(నేటి మధ్యాహ్నం మహాప్రస్థానంలో
కామ్రేడ్‌ సుగుణ గారి అంత్యక్రియలు)

జి.రాములు
9490098006

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -