– కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన అన్ని జిల్లాల్లోనూ రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరీ లేఖలు అందచేయాలని చెప్పారు. బుధవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిలా ఇంచార్జి మంత్రులకు లబ్దిదారుల జాబితా అందించి, వారి అనుమతితో కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. ఐదు లక్షల మంది యువతకు రూ.6,250 కోట్లతో స్వయం ఉపాధి కల్పించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనీ, దాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు మాట్లాడుతూ యూనిట్ల ఎంపిక లబ్ధిదారులకు ఆదాయ వనరుగా, ఆర్థికంగా బలపడేలా ఉండాలని సూచించారు. దశల వారిగా జరిగే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లబ్ధిదారులకు శిక్షణ, క్షేత్ర స్థాయిలో యూనిట్ల గ్రౌండింగ్ వరకు అధికారుల పర్యవేక్షణ ఉండాలనీ, బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధితో పాటు రాష్ట్ర జీడీపీలో వారిని భాగస్వామ్యం చేసేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు.
వర్షాలతో జాగ్రత్త…
నైరుతీ రుతుపవనాల రాకతో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల్లో కురుస్తున్న వర్షాల పట్ల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విపత్తు నివారణకు సంబంధించిన అన్ని పనిముట్లు, వనరులు, ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇ శ్రీధర్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ యాస్మిన్ భాషా తదితరులు పాల్గొన్నారు.
‘యువ వికాసం’ ఏర్పాట్లు చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES