Wednesday, April 30, 2025
Homeప్రధాన వార్తలుమిస్‌వరల్డ్‌ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు

మిస్‌వరల్డ్‌ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు

– అతిథుల బసకు కట్టుదిట్టమైన భద్రత
– విభాగాల వారీగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలకు ఎలాంటి లోటు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అందాల పోటీల ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పర్యాటక శాఖ, పోలీస్‌, ఇతర విభాగాలపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మిస్‌వరల్డ్‌ పోటీల ఏర్పాట్ల వివరాలను అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న శాఖల మధ్య సమన్వయం, తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. ఎయిర్‌పోర్టులు, అతిథులు బస చేసే హౌటళ్లతోపాటు పోటీలు జరిగే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈవెంట్‌కు వచ్చే అతిథులు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతా లను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. అలాగే నగరంలో పెండింగ్‌లో ఉన్న బ్యూటిఫికేషన్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మిస్‌ వరల్డ్‌ పొటీలు ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరెేందర్‌రెడ్డి, డీజీపీ జితెందర్‌, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌రంజన్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.
మే 7 నుంచి 31 వరకు…
మే 7 నుంచి 31వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ పోటీల ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, పర్యాటక అందాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వేర్వేరు వేదికలపై వేర్వేరు థీమ్‌లతో వీటిని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. దేశ, విదేశాల నుంచి మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు అతిథులు మే 6, 7 తేదీల్లో హైదరాబాద్‌కు తరలిరానున్నారు. మే 10న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో పోటీలు ప్రారంభమవుతాయి.
మే 12న బుద్ధవనంలో పోటీదారులతో అధ్యాత్మిక పర్యటన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్‌, హైదరాబాద్‌లో హెరిటేజ్‌ వాక్‌లు నిర్వహించనున్నారు. మే 13న చౌమహల్లా ప్యాలెస్‌లో అతిథులకు వెలకం డిన్నర్‌ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణకు పేరుప్రఖ్యాతలతో పాటు ఆర్థికంగా లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img