సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి : డీజీపీ బి.శివధర్రెడ్డి
పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం
నవతెలంగాణ – గోదావరిఖని
రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్’ ఉద్యమం కొనసాగించాలని తెలంగాణ డీజీపీ బి.శివధర్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా మారాయని, వాటిపై విస్తత అవగాహన కల్పించడం అత్యవసరమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి నెల చివరి వారంలో నిర్వహించే అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా చేయాలని, అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
డిఫెన్సివ్ డ్రైవింగ్పై ప్రత్యేక శిక్షణలు నిర్వహించడం, సీట్బెల్ట్, హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయించడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల కుటుంబ సభ్యుల అనుభవాలు, అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవడం ద్వారా అవగాహన మరింత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం నేరాలు కొత్త రూపాలు దాల్చుతున్నాయని, నేరస్తులు టెక్నాలజీ వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రతి అధికారి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు ప్రజల్లో కూడా అవగాహన పెంపొందించడం అవసరమని వివరించారు.పర్యటనలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని ఐబీ కాలనీలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12.29కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పోలీస్ క్వార్టర్స్ను డీజీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి, టీజీపీఐసీఎస్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, పెద్దపల్లి డీసీపీ బి.రామ్రెడ్డి, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గీతే, ఏసీపీలు, సీఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.



