Wednesday, December 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ బండారం బయటపెడతాం

అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ బండారం బయటపెడతాం

- Advertisement -

ప్రాజెక్టుల పేరుతో రూ.7 వేల కోట్లు పంచుకున్న ఉత్తమ్‌, భట్టి
20 శాతం కమీషన్‌ ఇస్తేనే బిల్లులు మంజూరు
ఇది ప్రభుత్వం కాదు…కన్సల్టెన్సీ కంపెనీ
దమ్ముంటే కో-ఆపరేటివ్‌ ఎన్నికలు జరపాలి: సీఎం రేవంత్‌రెడ్డికి
మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ ప్రభుత్వ బండారం బయటపెడతామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలపై మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ.ఏడు వేల కోట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క పంచుకున్నారని చెప్పారు. 20 శాతం కమీషన్‌ ఇచ్చిన వారి బిల్లులనే మంజూరు చేశారని వివరించారు. కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ తర్వాత రేవంత్‌ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందన్నారు. తన 25 ఏండ్ల రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9.30 గంటలకు చిట్‌చాట్‌ పెట్టి వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్‌ మీట్లు పెట్టారంటే అది కేసీఆర్‌ పవర్‌ అని అన్నారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్‌ ఆటలు, గ్లోబల్‌ సమ్మిట్‌లు పేదవాడికి అన్నం పెడతాయా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి సచివాలయం అంటేనే భయం పట్టుకుందనీ, వాస్తు భయంతోనే వెళ్లడం లేదని అన్నారు. గేట్లు, తలుపులు మార్చినా భయం పోలేదనీ, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కే పరిమితం అయ్యారని చెప్పారు. నాలుగు వేల మందికి పైగా బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడంతో రేవంత్‌రెడ్డికి ఓటమి భయం మొదలైందని వివరించారు. అందుకే కో-ఆపరేటివ్‌ ఎన్నికలు పెట్టకుండా, కాంగ్రెస్‌ కార్యకర్తలను నామినేషన్ల ద్వారా నియమించాలని చూస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే కో-ఆపరేటివ్‌ ఎన్నికలను జరపాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన సవాల్‌ విసిరారు. ఓయూకు ఒంటరిగా వెళ్తానంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లారని గుర్తు చేశారు. విద్యార్థి నాయకులను అరెస్టు చేయించి వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

15 రోజులు సభ జరపాలి
సాగునీటిపై ప్రభుత్వం ఇచ్చే పీపీటీని స్వాగతిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. కానీ వాస్తవాలు చెప్పడానికి బీఆర్‌ఎస్‌కు కూడా పీపీటీ ఇచ్చే అవకాశవ్వాలని కోరారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం ఇస్తూ తమ గొంతు నొక్కుతున్నారనీ, మైకులు కట్‌ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం కాదనీ, ఒక కన్సల్టెన్సీ కంపెనీ అని ఎద్దేవా చేశారు. బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడుస్తోందన్నారు. అప్పులు ఇప్పించినందుకు ఒక బ్రోకర్‌ కంపెనీకి గతంలోనే రూ.180 కోట్ల కమీషన్‌ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ అదే బ్రోకర్‌ సలహాతో జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి రూ.30 వేల కోట్ల అప్పు తేవాలని చూస్తున్నారని వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో కృష్ణా జలాల్లో నీటి వాడకం కేవలం 28.49 శాతం మాత్రమేనని చెప్పారు. తెలంగాణకు 45 టీఎంసీలు చాలంటూ ఉత్తమ్‌ లేఖ రాయడం చారిత్రక తప్పిదమనీ, ఆయన క్షమాపణ చెప్పి, వెంటనే 90 టీఎంసీల కోసం లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్‌ ట్యాపింగ్‌, ఫార్ములా-ఈ రేస్‌ అంటూ లీకులు ఇస్తూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందన్నారు.

అసెంబ్లీ ముగియగానే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తనకు నోటీసులు ఇస్తారనీ, ఈ సిట్‌ పెద్ద జోక్‌ అని అన్నారు. రేవంత్‌ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నామని చెప్పారు. ఏపీలో అధికారులకు పట్టిన గతే వారికీ పడుతుందన్నారు. రిటైర్‌ అయినా, విదేశాల్లో ఉన్నా గుంజుకొస్తామని హెచ్చరించారు. ఉద్యమంలో తనపై 300 కేసులున్నాయనీ, ఈ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని స్పష్టం చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డికి ఫుట్‌బాల్‌ ఆట రక్షణకే సమయం సరిపోతోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులపాటు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం తెచ్చిన వాళ్లం, త్యాగాల చరిత్ర తమదనీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అక్రమ కేసులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -