సిఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి : రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను మైనర్ పోర్టులుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోర్టులు, వాటి అభివృద్ధి తదితర అంశాలపై ఆయన ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫిషింగ్ హార్బర్ల అంశాన్ని ప్రస్తావించారు. జువ్వలదిన్నె నిజాంపట్నం, ఉప్పాడ హార్బర్ల మొదటి దశ పూర్తిచేయాలని చెప్పారు. అదేసమయంలో ఫిషింగ్ హార్బర్లను మైనరు పోర్టులుగా అభివృద్ధి చేసే అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు 20కి తగ్గకుండా చూడాలని చెప్పారు. వచ్చే ఏడాదికి నాలుగు పోర్టులు, నాలుగు పిషింగ్ హార్బర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలోనే ఎయిర్పోర్టుల అంశాన్ని కూడా ప్రస్తావించిన సిఎం కొత్తగా నిర్మించతలపెట్టిన కుప్పం, దగదర్తి, అమరావతి, శ్రీకాకుళం ఎయిర్పోర్టుల నిర్మాణం ముందుగా చేపట్టాలని నిర్దేశించారు. రాష్ట్రంలో 14 ఎయిర్పోర్టులు ఉండేలా చూడాలని చెప్పారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రాష్ట్ర రహదారుల విస్తరణ చేపట్టాలని, వాటిని జాతీయ రహదారులతో అనుసంధానించడంతో పాటు పిపిపి విధానంలో అభివృద్ధి చేయాలన్నారు.
త్వరలో ఎపి లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి హెలీ పోర్టుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. మచిలీపట్నం పోర్టు పనులు వచ్చే ఏడాది నవంబరు నాటికి పూర్తికానున్నాయని అధికారులు సిఎంకు వివరించారు. రామాయపట్నం పోర్టు మొదటిదశ పనులు 63.89, మూలపేట 46.59, కాకినాడ గేట్ పోర్టు పనులు 29.92 శాతం పూర్తయ్యాయని అధికారులు సిఎంకు తెలిపారు.
మైనర్ పోర్టులుగాఫిషింగ్ హార్బర్లు
- Advertisement -
- Advertisement -