Sunday, July 27, 2025
E-PAPER
Homeజాతీయంగోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు ప్రమాణ స్వీకారం

గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు ప్రమాణ స్వీకారం

- Advertisement -

హాజరైన కేంద్రమంత్రి, ఏపీ మంత్రులు, ఎంపీలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతి రాజు గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై స్థానంలో ఆయన ఆ బాధ్యతలను స్వీకరించారు. శనివారం గోవా రాజధాని పనాజీలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముంబయి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే గజపతిరాజు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌తో పాటు కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌ నాయుడు, శ్రీనివాసవర్మ, ఏపీ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, అశోక్‌ గజపతిరాజు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అశోక్‌ గజపతిరాజును ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఆయనను కూడా మంత్రి లోకేశ్‌ సత్కరించారు. అశోక్‌ గజపతి రాజు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. రాజకీయవేత్తగా ఆయనకు వివాదరహితుడిగా పేరుంది. గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. 2014లో విజయనగరం ఎంపిగా గెలుపొందారు. మోడీ క్యాబినెట్‌లో విమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మహారాజా అలక్‌నారాయణ విద్యాసంస్థలను అశోక్‌ గజపతి రాజు నిర్వహిస్తున్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా అశోక్‌ గజపతి రాజు చేశారు. ఎన్‌టిఆర్‌, చంద్రబాబు కేబినెట్‌లలో కీలక మంత్రిత్వ శాఖలను ఆయన చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -