న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ దిగ్గజం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నూతన చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) అశోక్ కుమార్ పాండాను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ సిఫారసు చేసింది. ప్రస్తుతం సెయిల్ డైరెక్టర్ (ఫైనాన్స్)గా బాధ్యతలు నిర్వహిస్తున్న పాండాకు ఈ సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ పూర్తి చేసి మేనేజ్మెంట్ ట్రయినీగా సెయిల్లో కెరీర్ ప్రారంభించిన ఆయన బిజినెస్ ఫైనాన్స్లో పిహెచ్డి కూడా పొందారు. గతంలో ఆయన డైరెక్టర్ (కమర్షియల్)గా అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. సెయిల్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో అశోక్ కుమార్ పాండా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా డీలెవరేజింగ్ ప్రయత్నాల ద్వారా సంస్థ అప్పులను ఏకంగా రూ.20,000 కోట్ల మేర తగ్గించిన ఘనత ఆయనకు దక్కుతుంది.



